కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జలహారతి పనులను పర్యవేక్షించాలని, పీజీఆర్ఎస్ తోపాటు ముఖ్యమంత్రి కార్యాలయం ఇతర మార్గాల ద్వారా వచ్చే అర్జీలను సంబంధిత అధికారులు వెంటనే పరిశీలించి, అవసరమైన విచారణ చేపట్టి తప్పనిసరిగా నివేదిక సమర్పించాలని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ఆదేశించారు. కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరం నుంచి కలెక్టర్ లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, జిల్లా స్థాయి అధికారులతో నేరుగా, డివిజన్, మండల స్థాయి అధికారులతో వర్చువల్గా బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మీశ మాట్లాడుతూ.. జలధార–జలహారతి 2.0 కింద పనులకు అవసరమైన అనుమతులను వేగంగా పొందడంతో పాటు పనులను పటిష్టంగా పర్యవేక్షించాలని సూచించారు. నెట్ జీరోలో భాగంగా ఎంపిక చేసిన పాఠశాలలు, ప్రభుత్వ సంస్థల్లో సోలార్ ప్యానెళ్లు, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, ప్లాంటేషన్ పనులను వేగవంతం చేసి, వేప, టేకు వంటి నాణ్యమైన మొక్కలు నాటేందుకు ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. ఆర్డీవోలు, సంబంధిత అధికారులు ఎరువుల దుకాణాలు, సహకార సంఘాల్లోని స్టాక్ను ప్రతి వారం తనిఖీ చేయాలని, ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా చూడాలని ఆదేశించారు. ఎరువుల దుకాణాల వద్ద ధరలు, ఫిర్యాదుల కోసం కలెక్టర్ కార్యాలయ కాల్ సెంటర్ వివరాలతో ఫ్లెక్సీ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సమావేశం అనంతరం కాలుష్య నియంత్రణ మండలి, ఇతర సమన్వయ శాఖల అధికారులతో కలిసి మట్టి వినాయక ప్రతిమలను పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం అంటూ రూపొందించిన పోస్టర్లను కలెక్టర్ లక్ష్మీశ ఆవిష్కరించారు. ఈ సమావేశంలో డీఆర్వో ఎం.లక్ష్మీ నరసింహం తదితరులు పాల్గొన్నారు.


