గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రజా సంక్షేమం, ఆర్థిక ప్రగతి, సమగ్రాభివృద్ధి లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలను విజయవంతం చేయడంలో బ్యాంకర్ల పాత్ర కీలకమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అన్నారు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన రూ. 1,00,648కోట్ల వార్షిక రుణ ప్రణాళిక (ఏసీపీ) లక్ష్యాలను పూర్తిస్థాయిలో చేరుకునేందుకు బ్యాంకులు కృషి చేయాలన్నారు. శుక్రవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా సంప్రదింపుల కమిటీ (డీసీసీ), జిల్లాస్థాయి సమీక్ష కమిటీ (డీఎల్ఆర్సీ) సమావేశాలు జరిగాయి. సమావేశంలోబ్యాంకింగ్, సీఎఫ్ఎల్ అధికారులతో కలిసి 2026–27 వార్షిక రుణ ప్రణాళికను కలెక్టర్ లక్ష్మీశ ఆవిష్కరించారు.
ప్రణాళిక ఇలా..
అనంతరం కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ 2026–27 ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయ రంగానికి రూ. 14,736కోట్లు, ఎంఎస్ఎంఈ రంగానికి రూ. 20,614కోట్ల రుణ లక్ష్యాలను ప్రతిపాదించినట్లు చెప్పారు. మొత్తం ప్రాధాన్య రంగానికి రూ.38,173కోట్లు, ప్రాధాన్యేతర రంగానికి రూ.62,475కోట్ల మేర లక్ష్యాలను రుణ ప్రణాళికలో పొందుపరిచినట్లు వివరించారు. ఇతర ప్రాధాన్య రంగానికి రూ.2,823కోట్ల రుణాలను ప్రతిపాదించినట్లు తెలిపారు. గతే డాది రుణ ప్రణాళిక లక్ష్యాల సాధనలో బ్యాంకు లు మంచి ప్రగతి కనబరిచాయని.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ బ్యాంకులు మరింత కీలకంగా వ్యవహరించి, లక్ష్యాలను చేరుకునేందుకు కృషి చేయాలన్నారు. లీడ్ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ హెడ్ ఎంవీ తిలక్, ఆర్బీఐ ఎల్డీవో రోహిత్ అగర్వాల్, ఎల్డీఎం పి.వెంకట సుబ్బయ్య, వి.అమరేశ్వరరెడ్డి, వీఎంసీ అడిషనల్ కమిషనర్ డి.చంద్రశేఖర్, సెంటర్ ఫర్ ఫైనాన్షియల్ లిటరసీ స్టేట్ హెడ్ బాబూరావు, అధికారులు పాల్గొన్నారు.
ప్రతిపాదనలను ఆవిష్కరించిన
కలెక్టర్ లక్ష్మీశ


