ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రావణ మాసం, మూడో శుక్రవారం, పౌర్ణమి నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకున్నారు. తెల్లవారుజాము నుంచి అమ్మ వారిని దర్శించుకునేందుకు భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణంలో పండుగ వాతావరణం కనిపించింది. శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని అమ్మవారి ప్రధాన ఆలయాన్ని రంగురంగుల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. మధ్యాహ్నం రెండు గంటల వరకు భక్తుల రద్దీ కొనసాగింది. ఆలయ ప్రాంగణంలోని క్యూలైన్లు కిటకిటలాడాయి. మహా మండపం లిఫ్టు, మెట్ల మార్గంతో పాటు ఘాట్రోడ్డు మార్గంలో రద్దీ కనిపించింది. శుక్రవారం కావడంతో సాయంత్రం ఆరు గంటలకు నిర్వహించిన పంచహారతుల సేవలో పలువురు ప్రముఖులు హాజరు కావడంతో ఆలయంలో సందడి వాతావరణం కనిపించింది. ఆలయ ఈవో శీనానాయక్ ఆలయ పరిసరాల్లో పర్యటించి, సిబ్బందికి సూచనలిచ్చారు.
రెండో రోజుకు పవిత్రోత్సవాలు..
శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో జరుగుతున్న పవిత్రోత్సవాలు శుక్రవారంతో రెండో రోజుకు చేరుకున్నాయి. మల్లేశ్వర స్వామి వారి ఆలయం సమీపంలోని యాగశాలలో ఆలయ అర్చకులు, వేద పండితులు పలు వైదిక కార్యక్రమాలను నిర్వహించారు.


