గంజాయి అక్రమ రవాణా చేస్తున్న నలుగురు అరెస్ట్
పోలీసుల అదుపులో
మరో ముగ్గురు బాలలు
నిందితుల వద్ద నుంచి 7.125 కిలోల గంజాయి స్వాధీనం
ఐదు ఫోన్లు, నాలుగు బైక్లు సీజ్
మరో ఇద్దరి కోసం కొనసాగుతున్న గాలింపు
కంకిపాడు: కంకిపాడు పోలీసుస్టేషన్ పరిధిలోని ఖాళీ స్థలాల్లో తనిఖీలు చేపట్టి గంజాయి విక్రయాలకు పాల్పడుతున్న నలుగురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. మరో ముగ్గురు బాలలను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 7.125 కిలోలు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు సోమవారం స్థానిక పోలీసుస్టేషన్లో గన్నవరం డీఎస్పీ ధర్మేంద్ర వివరాలను వెల్లడించారు.
ఒడిశా నుంచి బైక్పై..
కంకిపాడు పోలీసులకు అందిన సమాచారం, ఈగల్ టీమ్ సహకారంతో ఈనెల 23వ తేదీ రాత్రి పునాదిపాడు పంచాయతీ పరిధిలోని ఉలవచారు కంపెనీ వద్ద గల ఖాళీ స్థలాల్లో తనిఖీలు చేపట్టారు. గంజాయి కలిగి ఉన్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకు న్నారు. వారు ఇచ్చిన సమాచారంతో పునాదిపాడు–ఉప్పలూరు రోడ్డులోని ఆంజనేయస్వామి ఆలయం సమీపంలోని ఖాళీ స్థలాల్లో మరో ఐదుగురుని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో పునాదిపాడు గ్రామానికి చెందిన కొండూరు బాబూ రాజేంద్రప్రసాద్, దొండ పాటి శరణ్, నందిపాముల విజయ్కుమార్, కంకిపాడుకు చెందిన యడ్ల దుర్గాప్రసాద్లను సోమవారం అరెస్టు చూపారు. మిగిలిన ముగ్గురు బాలలు కావటంతో పోలీసుల పర్యవేక్షణలో ఉంచారు. మన్యం జిల్లా సీలేరు, ఒడిశా పరిసర ప్రాంతాల నుంచి బైక్పై గంజాయి తీసుకువచ్చి ఇక్కడ విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.
బైక్ దొంగతనం కూడా..
ఈ ప్రాంతానికి తీసుకువచ్చిన గంజాయిని విక్రయించేందుకు వీరు బైక్లను దొంగతనం చేశారు. వివిధ ప్రాంతాల్లో చోరీ చేసిన మూడు బైక్లతో పాటుగా సొంత బైక్పై గంజాయిని తీసుకెళ్లి విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. గంజాయికి బానిసలుగా తయారై అదే మార్గాన్ని ఆదాయ మార్గంగా ఎంచుకున్నారు. నిందితుల వద్ద నుంచి 7.125 కిలోల గంజాయి, ఐదు ఫోన్లు, ఒక సొంత బైక్, మూడు చోరీ చేసిన బైక్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల తనిఖీల్లో బండారు శేషగిరిబాబు, సుబ్బు పరారయ్యారు. ప్రత్యేక బృందాలతో దర్యాప్తు సాగిస్తున్నారు. కేసులో ప్రతిభ చూపిన సీఐ బీబీ రవికుమార్, ఎస్ఐ కేవై దాసు, హెచ్సీ పి.ప్రసాద్, పీసీలు సయ్యద్ బాజీబాబు, పీఎస్ఎన్ మూర్తి, ఎస్.అశోక్, జి.రామకృష్ణలను ప్రత్యేకంగా అభినందించి రివార్డులు అందజేశారు.


