గన్నవరం రూరల్: ముస్తాబాదలో నిర్మాణంలో ఉన్న రైల్ వోవర్ రైల్ ప్రాజెక్టును శనివారం హైకోర్టు అడ్వకేట్ కమిషనర్ శ్రీహరి పరిశీలించారు. అనంతరం రైతులతో మాట్లాడారు. ఈ ప్రాంతంలో 5.89 ఎకరాల్లో బసవయ్యకుంట చెరువు ఉంది. ఆర్వోఆర్ ప్రాజెక్టు నిర్మాణంలో 2 ఎకరాలు పోయింది. ఎగువ నుంచి వచ్చే వరద నీరు బసవయ్య కుంటలో చేరుతూ రైతులకు ఇంతకాలం ఆలంబనగా నిలుస్తోంది. ఈ ప్రాజెక్టులో 2 ఎకరాలు పోవటంతో వరదనీరు పంటలపై పడి నష్ట పరుస్తుందని స్థానిక రైతులు హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం బసవయ్యకుంటను ఆనుకుని 2ఎకరాల భూమిని కొనుగోలు చేసి రైతులకు అప్పగించింది. హైకోర్టులో వాదనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయి పరిశీలన కోసం హైకోర్టు అడ్వకేట్ కమిషనర్ను నియమించగా ఆయన ఇక్కడకు వచ్చి ప్రభుత్వం కొనుగోలు చేసిన భూమి బసవయ్య కుంటకు దగ్గరగానే ఉందా లేదా అనే అంశాన్ని పరిశీలించారు. పలువురు రైతులు తమ అభిప్రాయాలను ఆయన దృష్టికి తీసుకువెళ్ళారు. గుడివాడ ఆర్డీవో జి.బాలసుబ్రమణ్యం, తహసీల్దారు శివయ్య, మండల సర్వేయర్ మాధవరావు, ఆర్ఐ రవి, వీఆర్వో నళినీకుమార్, రైతులు శ్రీకాంత్, కోటయ్య, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.


