‘సైన్స్ సమగ్ర మహోత్సవ్’కు అరుదైన గుర్తింపు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఏపీ సైన్స్ సిటీ ఆధ్వర్యంలో సైన్స్ సమగ్ర మహోత్సవ్ 2కే26 కార్యక్రమం ఇండియా, ఏషియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం దక్కింది. శుక్రవారం విజయవాడ గాంధీ నగర్లోని చిట్టూరి పబ్లిక్ స్కూల్ నందు ‘సైన్స్ సమగ్ర మహోత్సవ్ – 2కే26’ ముగింపు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీ ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ ప్రవీణ్ ఆదిత్య, ఏపీ సైన్స్ సిటీ సీఈవో కేశినేని వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫిబ్రవరి 23న 2గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా ఏకకాలంలో నిర్వహించిన కార్యక్రమానికి విశేష స్పందన లభించిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 4,118 పాఠశాలల నుంచి 30 వేల మంది విద్యార్థులు పాల్గొని ప్రాజెక్టులను రూపొందించారన్నారు. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో 4 దశల్లో నిపుణుల జ్యూరీ కమిటీ ఆధ్వర్యంలో స్క్రూట్నీ జరిగిందన్నారు. ప్రాజెక్టులు ఆవిష్కరణ, శాసీ్త్రయ స్పష్టత, ఆచరణ, సమష్టి కృషి – పర్యావరణహిత దృక్పథం వంటి ప్రమాణాల ఆధారంగా ప్రాజెక్టులు ఎంపికయ్యాయన్నారు. జాతీయ సైన్స్ దినోత్సవం పురస్కరించుకుని చిట్టూరిలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి విజేతలకు ప్రవీణ్ ఆదిత్య, ఏపీ సైన్స్ సిటీ సీఈవో కేశినేని వెంకటేశ్వర్లు చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు.


