సీఎస్ఎస్ఆర్ పోటీలో ఏపీ ఎస్డీఆర్ఎఫ్ బృంద ప్రతిభ
భవానీపురం(విజయవాడపశ్చిమ): దక్షిణ ప్రాంతంలోని స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్డీఆర్ఎఫ్) బృందాలకు టెన్త్ బెటాలియన్ నేషనల్ డిజాస్టర్ రెస్సాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్) ఆధ్వర్యంలో ఈ నెల 23 నుంచి కృష్ణాజిల్లా కొండపావులూరులో నిర్వహించిన ప్రాంతీయ స్థాయి కొలాప్స్డ్ స్ట్రక్చర్ సెర్చ్ అండ్ రెస్క్యూ (సీఎస్ఎస్ఆర్) పోటీలు శుక్రవారంతో ముగిశాయి. ఈ పోటీలో మొత్తం ఏడు రాష్ట్రాల (ఆంధ్రప్రదేశ్, ఒడిశా, చత్తీస్గఢ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ, తెలంగాణ) నుంచి ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఏపీ ఎస్డీఆర్ఎఫ్) బృందాలు పాల్గొన్నాయి. ఈ పోటీలలో ఏపీ ఎస్డీఆర్ఎఫ్ బృందం ఉత్తమ ప్రతిభ కనబరిచి ద్వితీయ స్థానాన్ని కై వసం చేసుకుని ఉత్తర ప్రదేశ్లోని ఘజియాబాద్లో ఎయిత్ బెటాలియన్ నిర్వహించనున్న జాతీయ స్థాయి సీఎస్ఎస్ఆర్ పోటీలకు ఎంపికయ్యింది. ముగింపు కార్యక్రమానికి ఏపీఎస్పీ బెటాలియన్స్ అండ్ ఏపీ ఎస్డీఆర్ఎఫ్ ఐజీపీ బి.రాజకుమారి ముఖ్యఅతిథిగా హాజరై విజేతలను అభినందించారు. అలాగే డీఐజీ (ట్రైనింగ్ అండ్ ఎస్ అండ్ ఎస్సీజడ్) డాక్టర్ హరిఓం గాంఽధీ, ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్ కమాండెంట్ వీవీఎన్ ప్రసన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ఎస్డీఆర్ఎఫ్ బృందాల ప్రతిభను అభినందించి విజేత, రన్నరప్ బృందాలకు పతకాలు, ట్రోఫీలు ప్రదానం చేశారు. ఈ విజయం ఏపీ ఎస్డీఆర్ఎఫ్ నిబద్దత, కృషి, అత్యుత్తమ శిక్షణకు నిదర్శనంగా నిలిచిందని కొనియాడారు.


