దుర్గమ్మ సేవలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టివిక్రమార్క శుక్రవారం ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు సాదర స్వాగతం పలికారు. దుర్గమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనం ఇవ్వగా, ఆలయ ఏసీ రంగారావు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలతో ఉండాలని, సంక్షేమం, అభివృద్ధిలో ముందుండాలని కోరుకున్నానని పేర్కొన్నారు.
డయాలసిస్ రోగులకు ఆరోగ్యశ్రీ సేవలను అందించండి
పామర్రు: డయాలసిస్ రోగులకు ఎన్టీఆర్ వెద్య సేవ అందేలా చర్యలు తీసుకోవాలని కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీని సిలికానాంధ్ర సంజీవని వైద్యాలయం సీఈవో డాక్టర్ కూచిభట్ల ఆనంద్ కోరారు. కలెక్టర్ కూచిపూడిలోని సంజీవని వైద్యాలయాన్ని శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వైద్యాలయంలోని అత్యవసర విభాగం, ఆపరేషన్ థియేటర్, ఎక్స్రే, ప్రసూతి విభాగం, క్యాంటీన్ తదితర విభాగాలను పరిశీలించి ప్రజాభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వైద్యాలయం సీఈవో డాక్టర్ కూచిభట్ల ఆనంద్ మాట్లాడుతూ 2018లో దాతల సహకారంతో ఈ వైద్యాలయాన్ని నిర్మించామని రోజుకు 450 మంది వరకు వైద్య చికిత్స అందిస్తున్నామన్నారు. కలెక్టర్ స్పందిస్తూ డయాలసిస్ రోగులకు కూడా ఆరోగ్యశ్రీ సేవలు అందేలా ప్రతిపాదనలు పంపించాలని సీఈవోకు సూచించారు. అనంతరం కలెక్టర్ బాలాజీని సత్కరించారు. కార్యక్రమంలో మొవ్వ తహసీల్దార్ మస్తాన్, ఎంపీడీవో సుహాసిని, సర్పంచ్ కొండవీటి వెంకట విజయలక్ష్మి వైద్యాలయం ఏవో హనుమకుమారు, మేనేజర్ సత్యప్రకాష్ పాల్గొన్నారు.
శ్రీకొండలమ్మకు రూ.12.58 లక్షల ఆదాయం
గుడ్లవల్లేరు: వేమవరం శ్రీ కొండలమ్మ దేవస్థానంలోని హుండీల్లో భక్తులు వేసిన కానుకలను శుక్రవారం లెక్కించారు. 31రోజులకు నోట్ల ద్వారా రూ.11,20,055, చిల్లర ద్వారా రూ.1,38,754 మొత్తం రూ.12,58,809 లెక్కింపులో వచ్చింది. మచిలీపట్నం భోగిరెడ్డిపల్లి గ్రూప్ సూపర్వైజర్ అరుణ పర్యవేక్షణలో దేవస్థాన చైర్మన్ ఈడే మోహన్, ధర్మకర్తల మండలి సభ్యులు కళ్లేపల్లి సుగుణ శేఖర్, వడ్లమూడి రవీంద్ర బాబు, తూము రాజ్యలక్ష్మి, ముంగం ఆంజనేయులు, మన్నెం వీర నాగేంద్రరావు, ఈఓ ఆకుల కొండలరావు, వడ్లమన్నాడు ఇండియన్ బ్యాంక్ సిబ్బంది, గుడ్లవల్లేరు పోలీస్ సిబ్బంది హుండీలను తెరిచి కానుకలు లెక్కించారు.
ముగిసిన ఖోఖో శిక్షణ
గుడివాడటౌన్: స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో ఆలిండియా పోలీస్ ఖోఖో టోర్నమెంట్లో పాల్గొనే క్రీడాకారుల శిక్షణ శుక్రవారం ముగిసింది. స్టేడియం కమిటీ సభ్యులు క్రీడాకారులను అభినందించారు. ఈ సందర్భంగా స్టేడియం కమిటీ ఉపాధ్యక్షుడు యలవర్తి శ్రీనివాసరావు మాట్లాడుతూ మార్చి 7 నుంచి 12వ తేదీ వరకు జమ్మూ కశ్మీర్లో టోర్నమెంట్స్ జరుగుతాయన్నారు. ఏపీ తరఫున పోటీల్లో పాల్గొనే జట్టుకు ఎన్టీఆర్ స్టేడియం గత నెల రోజులుగా అతిథ్యం ఇచ్చి శిక్షణ తరగతులు నిర్వహించామన్నారు. పూర్తి స్థాయిలో తర్ఫీదు పొందిన ఈ జట్టు జాతీయ స్థాయిలో విజయం సాధించాలని కోరుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో జాయింట్ సెక్రటరీ కె. రంగప్రసాద్, సైబర్ సీఐ గణేష్, ఏపీ ఖోఖో అసోసియేషన్ అధ్యక్షుడు మడకా ప్రసాదు తదితరులు పాల్గొన్నారు.
దుర్గమ్మ సేవలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి
దుర్గమ్మ సేవలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి
దుర్గమ్మ సేవలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి


