అందెల రవళులతో పులకించిన ‘సిద్ధేంద్రయోగి’
పామర్రు: మొవ్వ మండలంలోని కూచిపూడి శ్రీ గంగా బాలా త్రిపుర సుందరి సమేత రామలింగేశ్వరస్వామి దేవాలయ కల్యాణోత్సవాల సందర్భంగా రెండో రోజు శుక్రవారం ప్రదర్శించిన కూచిపూడి, భరతనాట్యం ప్రదర్శనలతో ‘సిద్ధేంద్ర యోగి’ పులకించారు. కళాకారులు దేవాలయం సమీపంలోని శ్రీ సిద్ధేంద్రయోగి నాట్య కళావేదికపై ప్రదర్శించిన అంశాలు అలరించాయి. కళా నృత్యనికేతన్ (స్కూల్ ఆఫ్ కూచిపూడి) ప్రదర్శనలు, పద్మభూషణ్ డాక్టర్ వెంపటి చినసత్యం నృత్య దర్శకత్వంలో రూపొందించిన కృష్ణశబ్దం, ఆనంద తాండవం అంశాలను ప్రదర్శించారు. మధుసూదన్, శ్రీనిధి కదిరి నృసింహుడు, శివరంజని థిల్లానాలను ప్రదర్శించారు. శ్రీ సిద్ధ డ్యాన్స్ అకాడమీ ( వరంగల్) కళాకారులు పలు అంశాలను ప్రదర్శించారు. ఉమా నృత్యనికేతన్ నిర్వాహకురాలు రెడ్డి ఉమారాణి(రాజమండ్రి) బ్రహ్మాంజలి కామాక్షి అంశాలను ప్రదర్శించారు. కళాకారులను శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయ పాలకమండలి సభ్యులు కళారత్న రాధేశ్యామ్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు.


