సమన్వయంతో ‘పది’ పరీక్షలు నిర్వహిద్దాం
డీఈఓ చంద్రకళ
వన్టౌన్(విజయవాడపశ్చిమ): పదో తరగతి పరీక్షలను సమన్వయంతో నిర్వహిద్దామని ఎన్టీఆర్ జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ అన్నారు. ఈ సందర్భంగా మార్చి 2026లో నిర్వహించనున్న పదో తరగతి పరీక్షల ముందస్తు ఏర్పాట్లపై చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లకు ఓరియెంటేషన్ కార్యక్రమం నగరంలోని కేబీఎన్ కళాశాల ఆవరణలో శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రకళ మాట్లాడుతూ పరీక్షల నిర్వహణలో అత్యంత పారదర్శకత, క్రమశిక్షణ, సమన్వయం పాటించాలని అధికారులను ఆదేశించారు. నిర్లక్ష్యం, లోపాలు చోటుచేసుకోకుండా ప్రతి అంశాన్ని సక్రమంగా పర్యవేక్షించాలని సూచించారు. పరీక్ష కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్ సరఫరా, ఫర్నిచర్, సీటింగ్ ఏర్పాట్లు, విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు నిబంధనల ప్రకారం ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రశ్నపత్రాల స్వీకరణ, భద్రపరిచడం, పంపిణీ ప్రక్రియలో గోప్యత, భద్రతా ప్రమాణాలు కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. పరీక్షల సమయంలో 144 సెక్షన్ అమలు, పోలీసు శాఖతో సమన్వయం, పరీక్ష కేంద్రాల వద్ద అనవసర గుంపులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రతి చీఫ్ సూపరింటెండెంట్ తమ పరిధిలోని సిబ్బందితో ముందస్తు సమావేశాలు నిర్వహించి బాధ్యతలను స్పష్టంగా వివరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో విజయవాడ డీవైఈవోలు డి.సాంబశివరావు (విజయవాడ), ఎ.శ్యామ్సుందర్ (తిరువూరు), యు.గురునాథం (నందిగామ) డీసీఈబీ కార్యదర్శి షేక్ ఉమర్అలీ, అసిస్టెంట్ కమిషనర్ ఫర్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఎస్ రాంబాబు, ఏపీవోఎస్ఎస్ కోఆర్డినేటర్ పి.మురళి తదితరులు పాల్గొన్నారు.


