బరితెగించిన మట్టి దొంగలు!
చర్యలు తీసుకుంటాం..
హైకోర్టు ఆదేశాలను ధిక్కరించి మరీ దందా
జి.కొండూరు: చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సహజ వనరుల దోపిడీనే ఆదాయ మార్గంగా ఎంచుకున్న టీడీపీ నాయకులు, చెరువుల్లో నిండు కుండలా నీళ్లు ఉండగానే మట్టి తవ్వకాల కోసం ముమ్మర ప్రయత్నాలు చేయడం విస్మయానికి గురి చేస్తోంది. వేసవిలో మూగ జీవాల తాగునీటి అవసరాల కోసం నిల్వ ఉన్న నీటిని బయటకు పంపి మట్టి తవ్వకాలు చేయాలనే కుట్రను రైతులే భగ్నం చేశారు. మైలవరం మండల పరిధి గణపవరంలోని తూర్పు చెరువులో మట్టి తవ్వకాలు చేయకూడదని హైకోర్టు నుంచి ఉత్తర్వులు ఉన్నప్పటికీ టీడీపీ నాయకులు బరితెగించి నీళ్లను బయటకు పంపే ప్రయత్నం చేయగా.. రైతుల ఫిర్యాదు మేరకు రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు అడ్డుకున్నారు.
కోర్టు నుంచి స్టే తెచ్చిన రైతులు
గణపవరం గ్రామాన్ని ఆనుకొని ఎగువన 160.17ఎకరాల విస్తీర్ణంలో తూర్పు చెరువు ఉంది. ఈ చెరువు కింద ఆయకట్టు భూమి 500ఎకరాలు ఉంది. వర్షాధారంతో అడవి నుంచి ఈ చెరువుకు నీరు సరఫరా అవుతోంది. ఈ చెరువులో మట్టి తవ్వకాలు చేపడితే చెరువు లోతు ఎక్కువై నీరు పరిమితికి మించి నిల్వ ఉంటే కట్ట తెగి ఊరుమీద పడే అవకాశం ఉంది. అంతే కాకుండా మట్టి తవ్వకాల కోసం చెరువులో ఉన్న నీటిని వేసవికి ముందే బయటకు విడుదల చేస్తుండటంతో మూగజీవాలు ఇబ్బంది పడతాయని భావించిన రైతులు, చెరువులో చేపట్టిన మట్టి తవ్వకాలను నిలుపదల చేయాలని కోరుతూ గ్రామానికి చెందిన రైతు ఉమ్మా నర్మదా ఆధ్వర్యంలో గత ఏడాది ఏప్రిల్ నెలలో హై కోర్టుకు వెళ్లారు. రైతుల అభ్యర్థన మేరకు ఈ అంశంపై గత ఏడాది ఏప్రిల్ 15వ తేదీన హైకోర్టు స్టే ఇచ్చింది. ఈ చెరువులో ఎటువంటి తవ్వకాలు చేయొద్దని ఈ ఏడాది జనవరి 28వ తేదీన హైకోర్టు శాశ్వత ఉత్తర్వులను సైతం జారీ చేసింది.
కోర్టు ఆదేశాలను ధిక్కరించి..
హైకోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత చెరువుకు ఉన్న రెండు తూములలో ఒక తూము తాళపు చెవిని స్థానిక రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే మరో తూము తాళపు చెవి గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడి దగ్గరే ఉంది. దీనితో కోర్టు ఆర్డర్ని సైతం పక్కనబెట్టిన టీడీపీ నాయకుడు తన దగ్గర ఉన్న తాళపు చెవిని వినియోగించి ఈ నెల 16వ తేదీన తూము తెరిచి చెరువు నుంచి నీటిని అనవసరంగా బయటకు వదిలారు. దీనితో గ్రామానికి చెందిన రైతుల ఫిర్యాదు మేరకు కోర్టు ఆర్డర్ని పాటిస్తూ రెవెన్యూ అధికారులు నీటి విడుదలను నిలిపివేశారు. ఆ తర్వాత చెరువులో నీటి విడుదలను అడ్డుకోవాలని కోరుతూ గ్రామానికి చెందిన 480మంది రైతులు, గ్రామస్తులు సంత కాలను చేసి ఈ నెల 20వ తేదీన ఇరిగేషన్శాఖ, రెవెన్యూ శాఖ అధికారులు, కలెక్టర్కు వినతిపత్రాన్ని అందజేశారు. అయినప్పటికీ వెనక్కి తగ్గని టీడీపీ నాయకులు ఈ నెల 21వ తేదీన రాత్రి మరలా తూము తెరిచి చెరువులో నీటిని బయటకు విడుదల చేశారు. దీనితో మరలా ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు అడ్డుకున్నారు.
గ్రామస్తుల ఆందోళన..
టీడీపీ నాయకులు తూర్పు చెరువులో విచ్చలవిడిగా తవ్వకాలు చేయడం వల్ల చెరువులోతు పెరిగి పరిమితికి మించి నీరు నిల్వ ఉండి గత ఏడాది చెరువు కళంగి వద్ద కట్ట తెగడంతో నీరు గ్రామం మీదకు వచ్చింది. అధికారులు వెంటనే అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. మరలా అటువంటి ఘటనలే జరిగే అవకాశం ఉందని గ్రామస్తులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వేసవి సమీపిస్తున్న వేళ ఎగువన ఉన్న చెరువులో నీటిని బయటకు పంపితే గ్రామంలో భూగర్భజలాలు పడిపోయి తాగునీటి ఎద్దడి వచ్చే అవకాశం ఉందని, వేసవిలో మూగజీవాలు తాగునీటి అవసరాలకు నీరు లేకపోతే నరకయాతన పడతామని గ్రామస్తులు, రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గణపవరం తూర్పు చెరువును చెరపట్టిన టీడీపీ నాయకులు
మట్టి తవ్వకాల కోసం నీటిని బయటకు పంపే ప్రయత్నాలు
రైతుల ఫిర్యాదుతో నీటి విడుదలను అడ్డుకున్న రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు
చెరువులో తవ్వకాలు చేయవద్దని హైకోర్టు నుంచి ఉత్తర్వులు
అనుమతి లేకుండా నీటిని విడుదల చేస్తే ఊరుకునేది లేదు గణపవరం తూర్పు చెరువులో అనవసరంగా చేస్తున్న నీటి విడుదలను అడ్డుకున్నాం. అదే కొనసాగితే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. కోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం చెరువులో అక్రమ మైనింగ్ జరగకుండా చర్యలు తీసుకున్నాం. చెరువులో ఎటువంటి కార్యకలాపాలు చేయాలన్నా అనుమతి పొందిన తర్వాతే చేయాలి.
– రాజశేఖర్, ఇరిగేషన్ ఏఈ,
మైలవరం
బరితెగించిన మట్టి దొంగలు!


