ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత విద్యకు దరఖాస్తులు
వన్టౌన్(విజయవాడపశ్చిమ): విద్యాహక్కు చట్టం 2009 ప్రకారం పేద, మధ్య తరగతి కుటుంబాల విద్యార్థులకు ఉచితంగా కార్పొరేట్ విద్యను పొందేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఎన్టీఆర్ జిల్లా విద్యాశాఖాధికారి ఎల్. చంద్రకళ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఒకటో తరగతిలో ప్రవేశాలకు ప్రభుత్వం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.20 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో 1.44 లక్షలుగా ఉండాలని, స్టేట్ సిలబస్లో చేరే విద్యార్థి జూన్ 2, 2020 నుంచి, 31 మే 2021 మధ్య జన్మించి ఉండాలని, అలాగే సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ సిలబస్ పాఠశాలలో చేరే విద్యార్థి రెండు ఏప్రిల్ 2020 నుంచి 31 మార్చి 2021 మధ్య జన్మించి, ఐదు సంవత్సరాలు నిండి ఉండాలని పేర్కొన్నారు. వెబ్సైట్, స్వర్ణగ్రామ, వార్డు సచివాలయాలు, ఎంఈవో కార్యాలయం, మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. అలాగే చిరునామా ధ్రువీకరణకు ఏదైనా గుర్తింపు కార్డు, పత్రాన్ని పరిగణనలోకి తీసుకుంటారని తెలిపారు. విద్యార్థి జనన, కుల, వార్షికాదాయ ధ్రువీకరణ పత్రాలు జతచేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో 512 కార్పొరేట్, ప్రైవేట్, అన్ఎయిడెడ్ పాఠశాలలు ఉన్నాయని అందులో గత ఏడాది వెయ్యి మందికి ప్రవేశాలు కల్పించినట్లు పేర్కొన్నారు. మార్చి 10వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని, అదే నెల 25వ తేదీన లాటరీ తీసి విద్యార్థులను ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. ఏప్రిల్ 13 నుంచి 23వ తేదీ వరకూ ప్రవేశాల నిర్ణయం ఉంటుందని వివరించారు.
● హామీలు అమలు కాని పక్షంలో మార్చి 2న మహాధర్నా
● ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్ యూనియన్
మచిలీపట్నంఅర్బన్: అంగన్వాడీలకు కనీస వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆద్వర్యంలో సోమవారం కలక్టరేట్ ధర్నా చౌక్ వద్ద రిలే నిరహార దీక్షలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ అధ్యక్ష, కార్యదర్శులు కె.లక్ష్మీ, సీహెచ్ నాంచారమ్మ మాట్లాడుతూ 2024 జూలైలో వేతనాలు పెంచడంతో పాటు ఇతర సమస్యలను పరిష్కరిస్తామని ప్రభుత్వం మినిట్స్ కాపీ ఇచ్చిందని.. కానీ హామీల అమలులో ఆలస్యం చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చిందని గద్దెనెక్కి రెండేళ్లు అవుతున్నా ఒక్కహామీ కూడా అమలు చేయలేదన్నారు. హామీల అమలు సాధనకు ఈ నెల 23 నుంచి 27వ తేదీ వరకు ప్రాజెక్టు, జిల్లా స్థాయిలలో రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తామన్నారు. అప్పటికీ చేయని పక్షంలో మార్చి 2న విజయవాడలో మహాధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. సీఐటీయూ, ఏఐటీయూసీ నాయకులు సీహెచ్ జయరావు, లింగం ఫిలిప్, ఆశ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష, కార్యదర్శలు జి. చిట్టి కుమారి, పి. ధనశ్రీ తదితరులు మద్దతు తెలిపారు.


