సమాజంలో పెరుగుతున్న మానసిక సమస్యలు
లబ్బీపేట(విజయవాడతూర్పు): సమాజంలో మానసిక సమస్యలతో బాధపడుతున్న వారు పెరుగుతున్నారని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ డాక్టర్ టి.సాయిసుధీర్ అన్నారు. ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ(ఐపీఎస్) ఏపీ చాప్టర్, ఇండ్లాస్ హాస్పిటల్స్ సంయుక్తంగా ఏపీ మిడ్టర్మ్ సీఎంఈ–2026 శనివారం ప్రారంభమైంది. మానసిక వ్యాధులు.. అధునాతన చికిత్సా పద్ధతులు అనే అంశంపై రెండు రోజుల పాటు నిర్వహించనున్న సీఎంఈని హెల్త్ యూనివర్సిటీ వీసీ సాయిసుధీర్ జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ మానసిక సమస్యలకు వైద్యం పొందడంలో ప్రజలు ఇంకా వెనుకాడుతున్నారని, ప్రజల్లో అపోహలను తొలగించడంలో మానసిక వైద్యుల కృషి అవసరం అన్నారు. మరో అతిథి చీఫ్ ఇన్కంటాక్స్ కమిషనర్ సునీత బిల్లా మాట్లాడుతూ మానసిక వ్యాధి సోకిన వారికి సరైన వైద్యం అందించలేనప్పుడు ఆ ప్రభావం కుటుంబం, సమాజంపై ఉంటుందన్నారు.కార్యక్రమానికి ఐపీఎస్ రాష్ట్ర చాప్టర్ అధ్యక్షుడు డాక్టర్ పి.లోకేశ్వరరెడ్డి అధ్యక్షత వహించగా, ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి, సెక్రటరీ డాక్టర్ ఇండ్ల విశాల్రెడ్డి పాల్గొన్నారు. రెండు రోజుల పాటు జరిగే సదస్సులో బెంగళూరు విమ్హాన్స్తో పాటు, ముంబై, చైన్నె, పూనే తదితర ప్రాంతాలకు చెందిన మానసిక వైద్య నిపుణులు మానసిక వ్యాధులకు అధునాతన చికిత్సలపై విశ్లేషణాత్మక ప్రసంగాలు ఇవ్వనున్నారు. సదస్సులో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి 300 మంది మానసిక వైద్యులు, మానసిక వైద్యంలో పోస్టు గ్రాడ్యుయేషన్ చేస్తున్న విద్యార్థులు పాల్గొన్నారు.
హెల్త్ యూనివర్సిటీ వీసీ సాయిసుధీర్


