
భూ సేకరణను వేగవంతం చేయండి
ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఇలక్కియ
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): విజయవాడ – హైదరాబాద్ సెక్షన్లో జాతీయ రహదారి ఎన్హెచ్ 65ను ఆరు లైన్ల రహదారిగా విస్తరణ, పెడన– విస్సన్నపేట 216ఎన్హెచ్ విస్తరణ, మెట్రో రైలు ప్రాజెక్టు భూసేకరణకు జాయింట్ ఇన్స్పెక్షన్ పనులను వేగవంతం చేసి నివేదికలను సమర్పించాలని ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆయా అంశాలపై మంగళవారం కలెక్టరేట్లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జేసీ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. జేసీ ఇలక్కియ మాట్లాడుతూ..
● హైదరాబాద్ – విజయవాడ ఎన్హెచ్ 65 రహదారికి సంబంధించి 226 కిలోమీటర్ల మేర ఆరు లైన్ల విస్తరణలో భాగంగా నందిగామ డివిజన్లోని జగ్గయ్యపేట, వత్సవాయి, పెనుగంచిప్రోలు మండలాల్లో జాతీయ రహదారుల అధికారులకు ఎన్జాయిమెంట్ సర్టిఫికెట్లకు సంబంధించి ప్రతిపాదనలు పంపాల్సి ఉందన్నారు. అనుమంచిపల్లి, షేర్మహమ్మద్పేట, తోటచర్ల, భీమవరం గ్రామాలకు సంబంధించి ఆయా మండల తహసీల్దార్లు ప్రతిపాదనలు సమర్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
● పెడన–విసన్నపేట 216 ఎన్హెచ్ జాతీయ రహదారి విస్తరణకు సంబంధించి జిల్లాలో విస్సన్నపేట, తిరువూరు మండలాల్లో 9 గ్రామాల నుంచి ప్రతిపాదనలు రావాల్సి ఉండగా.. 5 గ్రామాలకు ప్రతిపాదనలు పంపారన్నారు. మిగిలిన గ్రామాలకు సంబంధించిన ప్రతిపాదనలు పంపేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని తిరువూరు ఆర్డీవోకు సూచించారు.
● ఔటర్ రింగ్రోడ్ నిర్మాణానికి సంబంధించి అవసరమైన భూమికి ప్రతిపాదనలు పంపామని, రికార్డులను పరిశీలించి 3ఏ రిపోర్టు తయారు చేసి పంపాలన్నారు. ఇందుకు సంబంధించి కంచికచర్ల, మైలవరం, జి. కొండూరు మండలాలలో 3ఏ ప్రతిపాదనలు సమర్పించాలన్నారు.
● జాతీయ రహదారి గ్రీన్ఫీల్డ్ ఎలైన్మెంట్ సంబంధించి 273 ఎకరాలకు గాను 243 ఎకరాలను సేకరించామని, మిగిలిన 30 ఎకరాల పట్టా భూమిని సేకరించేందుకు 3ఏ నోటిఫికేషన్ ఇచ్చామన్నారు.
● భూములను సర్వే చేసేందుకు సర్వేయర్లు అందుబాటులో లేకుంటే ఇతర మండలాల నుంచి సర్వేయర్లను డెప్యూటేషన్పై నియమించేందుకు చర్యలు తీసుకోవాలని ఆర్డీవోకు జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియ సూచించారు.
సమావేశంలో విజయవాడ, నందిగామ, తిరువూరు ఆర్డీవోలు కె. చైతన్య, కె. బాలకృష్ణ, కె. మాధురి, ఎన్హెచ్ఏఐ ప్రాజెక్ట్ డైరెక్టర్లు ఎం.విద్యాసాగర్ (విజయవాడ), ఎం. రామాంజనేయ రెడ్డి(ఖమ్మం), టి. పార్వతీశం(అమరావతి) పాల్గొన్నారు.