చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లాలో గృహనిర్మాణాలను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశపు హాలులో గృహ నిర్మాణాల పురోగతిపై క్షేత్రస్థాయి అధికారులతో మంగళవారం సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గృహనిర్మాణ పురోగతి సంతృప్త స్థాయిలో లేదని కాంట్రాక్టర్లు, లబ్ధిదారులతో సమావేశాలు నిర్వహించి ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయడానికి కృషి చేయాలన్నారు. 15 రోజుల క్రితం గృహ నిర్మాణాల పురోగతిపై సమీక్ష నిర్వహించి అధికారులకు లక్ష్యాలు నిర్ధేశించినప్పటికీ చాలా మండలాల్లో అనుకున్న స్థాయిలో పురోగతి లేదన్నారు. జూలై మొదటి వారంలో తిరిగి మరలా సమీక్షిస్తానని, ఈలోగా వివిధ దశల్లో ఉన్న నిర్మాణాలు పూర్తి చేయాలన్నారు. సమావేశంలో గృహనిర్మాణ సంస్థ అధికారి వెంకట్రావు, జెడ్పీ డెప్యూటీ సీఈవో ఆనంద్కుమార్, డీటీడబ్ల్యూవో ఫణిదూర్జటి, డీఆర్డీఏ పీడీ హరిహరనాథ్, డీఎస్వో వి. పార్వతి తదితరులు పాల్గొన్నారు.
వైద్య, ఆరోగ్యశాఖలో సాధారణ బదిలీలు
మచిలీపట్నంఅర్బన్: ఉమ్మడి కృష్ణాజిల్లా పరిధిలోని వైద్య, ఆరోగ్యశాఖలో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు జిల్లా క్యాడర్ ఉద్యోగుల సాధారణ బదిలీలు మంగళవారం నిర్వహించినట్లు కృష్ణాజిల్లా, వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్ శర్మిష్ఠ తెలిపారు. జిల్లా స్థాయి పోస్టులైన ఎంపీహెచ్ఏ(ఎఫ్), ఎంపీహెచ్ఏ(ఎం), జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్–2, డ్రైవర్లు, అటెండర్లు, క్లాస్–4 ఉద్యోగులు ఐదేళ్లకుపైగా ఒకే చోట పనిచేసిన 46 మంది, ఐదేళ్ల లోపు ఒకే చోట పనిచేసిన 20 మందిని బదిలీ చేశామన్నారు. జిల్లా క్యాడర్లను జూమ్ కౌన్సెలింగ్ ద్వారా కోరిన ఆప్షన్ మేరకు బదిలీ ఉత్తర్వులు అందజేసినట్లు తెలిపారు.
చోడవరం ఇసుక ర్యాంప్నకు గండి
పెనమలూరు: చోడవరం ఇసుక ర్యాంప్నకు మంగళవారం అధికారులు గండి కొట్టించారు. చోడవరం గ్రామ పరిధిలో కృష్ణానది నుంచి అక్రమ ఇసుక రవాణా జరుగుతోంది. దీనిపై ‘సాక్షి’లో మంగళవారం ప్రచురితమైన ‘పండగ చేసుకుంటున్న తమ్ముళ్లు’ కథనంపై కలెక్టర్ స్పందించారు. జాతీయ హరిత ట్రిబ్యూనల్ ఆదేశాల మేరకు కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అక్టోబర్ 15వ తేదీ వరకు జిల్లా పరిధిలో ఎక్కడా ఇసుక తవ్వకాలు చేయరాదని ప్రకటించారు. ఇసుక తవ్వకాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అయితే చోడవరం ఇసుక క్వారీలో రాత్రి సమయాల్లో అక్రమంగా ఇసుక తవ్వకాలు చేసి లారీల్లో తరలిస్తున్నారు. కలెక్టర్ ఆదేశాలను మండల అధికారులు, పోలీసులు అమలు చేయలేదు. ‘సాక్షి’లో కథనం రావటంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు చోడవరం ఇసుక క్వారీ ర్యాంప్నకు గండి కొట్టించారు. పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
పోలీసుల కళ్లుగప్పి తప్పించుకున్న జువైనల్స్
కృష్ణలంక(విజయవాడతూర్పు): పార్కింగ్ చేసిన ద్విచక్రవాహనాలు.. పొలాల్లోని మోటర్లను రెప్పపాటులో దొంగిలించే ఘరానా దొంగలు పోలీసుల కళ్లుగప్పి తప్పించుకున్నారు. వివరాల్లోకి వెళితే.. బాపట్ల పరిసర ప్రాంతాల్లో ద్విచక్రవాహనాలు, విద్యుత్ మోటర్లు అపహరించిన కేసులో నిందితులైన ఇద్దరు బాలురను మంగళవారం విజయవాడలోని కోర్టులో బాపట్ల పోలీసులు హాజరుపరిచారు. కోర్టు అనుమతితో వీరిని కోర్టు నుంచి జువైనల్ హోంకు తరలించేందుకు బస్టాండ్కు తీసుకెళ్లారు. ఇద్దరు నిందితులకు కాపలాగా ఇద్దరు కానిస్టేబుళ్లు, ఒక హోంగార్డు ఉన్నారు. వారి కళ్లుగప్పి ఇద్దరూ పరారయ్యారు. పరారైన ఇద్దరు బాల నేరస్తుల్లో ఒకరు బాపట్ల పట్టణానికి చెందిన వ్యక్తికాగా, మరొకరు కర్లపాలెం మండలం పేరలి గ్రామానికి చెందిన వ్యక్తి. వీరికోసం అర్ధరాత్రి వరకు పోలీసులు గాలిస్తూనే ఉన్నారు.
గృహనిర్మాణాలు వేగవంతం కావాలి
గృహనిర్మాణాలు వేగవంతం కావాలి
గృహనిర్మాణాలు వేగవంతం కావాలి