
జీఎస్టీ కచ్చితంగా వసూలు చేయాలి
చిలకలపూడి(మచిలీపట్నం): కృష్ణా జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, విద్యాసంస్థల నుంచి వస్తుసేవల పన్ను (జీఎస్టీ) కచ్చితంగా వసూలు జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ డి.కె.బాలాజీ ఆదేశించారు. కలెక్టరేట్ లోని తన చాంబర్లో ఎస్పీ ఆర్.గంగాధరరావు, జాయింట్ కలెక్టర్ గీతాంజలిశర్మ, వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ ఐ.హేమతో కలిసి వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ మంగళవారం సమన్వయ సమావేశాశం నిర్వహించారు. కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ.. వాణిజ్య శాఖ వసూలు చేసే రెవెన్యూ ద్వారానే ప్రజలకు అమలు చేసే సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలుతో పాటు ఉద్యోగులకు ప్రతి నెలా జీతాలు వస్తున్నాయని పేర్కొన్నారు. పన్నులు సరిగా వసూలు చేయకపోతే ఆదాయం తగ్గిపోతుందని పేర్కొన్నారు. అధికారులు అందరూ సమన్వయంతో వస్తు సేవల పన్ను, వృత్తి పన్ను సక్రమంగా వసూలు చేసి ప్రభుత్వానికి ఆదాయం పెంచాల్సిన అవసరం ఉందన్నారు. జీఎస్టీ ఎగవేతదారుల జాబితాను వాణిజ్య పన్నులశాఖ అధికారులు అందిస్తారని, ఆ జాబితా మేరకు తహసీల్దార్లు తమ పరిధిలో వసూలు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అన్ని బ్యాంకులకు ఈ జాబితాను అందజేస్తామని, వారు కూడా బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేసి పన్ను బకాయిలు వసూలు చేసేందుకు సహకరించాలని కోరారు. జిల్లాలో 177 ప్రభుత్వ శాఖలు ఉండగా కేవలం 84 శాఖలు మాత్రమే జీఎస్టీ, టీఎస్ ఫైలింగ్ జరుగుతోందని, మిగిలిన శాఖల్లో కూడా ఫైలింగ్ చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అన్ని ప్రైవేటు విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల నుంచి ప్రతి నెలా వృత్తి పన్ను వసూలు చేయాలన్నారు. మునిసిపాల్టీలు, క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న సిబ్బంది కూడా వృత్తి పన్ను చెల్లించాల్సి ఉంద న్నారు. వాణిజ్య పన్నులశాఖ అధికారులకు క్షేత్రస్థాయిలో అన్ని విధాల చేయూతను అందించి పన్నులు సక్రమంగా వసూలయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. గనులు, భూగర్భ వనరులుపై జీఎస్టీ వసూలయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. గనులు, భూగర్భ వనరులు అక్రమంగా రవాణా కాకుండా నిరోధించాలని స్పష్టంచేశారు. ప్రతి పంచా యతీ కార్యదర్శి ఇకపై ప్రతి నెలా పదో తేదీలోగా జీఎస్టీ, టీడీఎస్ ఫైలింగ్ తప్పనిసరిగా చేయాలన్నారు. ఇందుకోసం వాణిజ్య పన్నులశాఖ అధికారులు పంచాయతీ కార్యదర్శులకు ప్రత్యేకంగా శిక్షణ తరగతులు నిర్వహించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ కమిషనర్ వెంకటేశ్వరరావు, జెడ్పీ సీఈఓ కన్నమనాయుడు, పంచాయతీరాజ్ ఎస్ఈ రమణారావు, హౌసింగ్ పీడీ వెంకట్రావు, ఎల్డీఎం సి.రవీంద్రరెడ్డి, బందరు ఆర్డీఓ కె.స్వాతి తదితరులు పాల్గొన్నారు.
కృష్ణా జిల్లా కలెక్టర్ బాలాజీ