
‘తల్లికి వందనం’ పేరుతో మోసం
కంచికచర్ల: తల్లికి వందనం పథకాన్ని కూటమి ప్రభుత్వం పూర్తిస్థాయిలో అమలు చేయకపోవడం సిగ్గుచేటని ఎస్ఎఫ్ఐ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు గోపీనాయక్ మండిపడ్డారు. కంచికచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద మంగళవారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ సందర్భంగా గోపీ నాయక్ మాట్లాడుతూ.. కుటుంబంలో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు ఎంతమంది విద్యార్థులుంటే అంతమందికి తల్లికి వందనం కింద రూ.15 వేల చొప్పున ఇస్తామని కూటమి నాయకులు హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చాక మాట తప్పడం సిగ్గుచేటని పేర్కొన్నారు. పథకం అమలులో ఆంక్షల పేరిట తల్లులను మోసం చేశారని దుయ్యబట్టారు. ఈ ఏడాది ప్రతి ఒక్క విద్యార్థికి రూ.15 వేలు ఇస్తామని గొప్పలు చెప్పి రూ.13 వేలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకొన్నారని పేర్కొన్నారు. ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల వద్ద వసూలు చేసిన నగదును విద్యా సంస్థల అభివృద్ధికి ఉపయోగిస్తుందా అని ప్రశ్నించారు. అసంబద్ధ నిబంధనల పేరుతో విద్యార్థుల సంఖ్యను కుదింపు చేయడాన్ని ఖండిస్తున్నామని స్పష్టంచేశారు. జీఓ 77ను రద్దు చేసి పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వా లని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు షేక్ ఖజు, తులసి, వరలక్ష్మి, దీపిక తదితరులు పాల్గొన్నారు.
ఎస్ఎఫ్ఐ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు
గోపీనాయక్