
పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహం
పెనమలూరు: జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు ప్రొత్సాహం కల్పిస్తామని, ప్రభుత్వం తరఫున అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. కానూరు అన్నే కల్యాణ మండపంలో మంగళవారం రాత్రి పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో పారిశ్రామిక వేత్తలతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ బాలాజీ మాట్లాడుతూ జిల్లాలో పారిశ్రామిక వేత్తలకు సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకు వస్తే సమస్యలు వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అదే రాష్ట్ర స్థాయిలో సమస్యలు ఉంటే వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతానని తెలిపారు. పారిశ్రామిక వేత్తలు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవటానికి పారిశ్రామిక సదస్సు నిర్వహిస్తామన్నారు.
పూర్తి సహకారం..
జాయింట్ కలెక్టర్ గీతాంజలిశర్మ మాట్లాడుతూ జిల్లాను పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దటానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తామన్నారు. పరిశ్రమలు ఏర్పాటుకు స్థలం, ఇతర అనుమతులు ఇవ్వటానికి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ ఆర్. వెంకట్రావు, ఆర్డీఓ బీఎస్ హేళాషారూన్, కార్మిక శాఖ సహాయ కమిషనర్ ఆశారాణి, ఎల్డీఎంసీ అధికారి రవీంద్రరెడ్డి, ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు పి.భాస్కరరావు, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ చైర్ పర్సన్ వి.నాగలక్ష్మి, పారిశ్రామిక వేత్తలు తదితరులు పాల్గొన్నారు.
కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీ