
బస్టాండ్, రైల్వే స్టేషన్లలోనూ ఆర్జిత సేవల కౌంటర్లు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): అమ్మవారి ఆలయ సత్రాలు, కాటేజీలతో పాటు రైల్వేస్టేషన్, బస్టాండ్ కౌంటర్లలో అన్ని ఆర్జిత సేవలను బుక్ చేసుకునే సదుపాయాన్ని కల్పించనున్నామని దుర్గగుడి ఈవో శీనానాయక్ పేర్కొన్నారు. రైల్వే స్టేషన్ 1వ నంబర్ ప్లాట్ఫామ్పై ఉన్న దేవస్థాన ప్రసాదాల కౌంటర్ను ఆలయ ఈవో శీనానాయక్ మంగళవారం తనిఖీ చేశారు. కౌంటర్లో లభిస్తున్న సేవల గురించి సిబ్బందిని ఆరా తీశారు. కేవలం అమ్మవారి ప్రసాదాలను మాత్రమే భక్తులకు అందిస్తున్నట్లు సిబ్బంది పేర్కొన్నారు. దేవస్థానానికి సంబంధించిన అన్ని ఆర్జిత సేవలను బుక్ చేసుకోవడమే కాకుండా ఆలయ సమాచారం మొత్తం భక్తులకు చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. దేవస్థానానికి చెందిన మాడపాటి సత్రం, జమ్మిదొడ్డి భవనంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. భక్తులు సమర్పించే కానుకలు, విరాళాలను సైతం ఈ కౌంటర్లో తీసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు.