ఖరీఫ్‌.. అవస్థలమయం | - | Sakshi
Sakshi News home page

ఖరీఫ్‌.. అవస్థలమయం

Jun 18 2025 3:09 AM | Updated on Jun 18 2025 3:09 AM

ఖరీఫ్‌.. అవస్థలమయం

ఖరీఫ్‌.. అవస్థలమయం

● ఆది నుంచే ఆటుపోట్లు ● నారుమడులను సిద్ధం చేస్తున్న రైతులు

కంకిపాడు: ఆటుపోట్లు అధిగమిస్తూ రైతులు ఖరీఫ్‌ సాగుకు సమాయత్తమవుతున్నారు. విత్తనాలతో మొదలైన సమస్య, సాగునీటి కటకటతో అవస్థలమయంగా తయారైంది. సాగు ఆరంభంలోనే ఇబ్బందులు పడుతూ సాగుకు ఉపక్రమించాల్సిన దుస్థితి నెలకొంది.

నారుమడులు సిద్ధం చేస్తూ...

కృష్ణాజిల్లా పరిధిలో తొలకరి వర్షాల రాకతో రైతులు ఖరీఫ్‌ సాగు పనులు ఆరంభించారు. భూములను దుక్కులు దున్ని, దమ్ములు చేసుకున్నారు. వరి నారుమడి పెంచేందుకు అనువైన ప్రదేశాన్ని ఎంపిక చేసుకుని ఆ ప్రాంతంలో పూర్వ పంట తాలూకా వ్యర్థాలను తొలగించి దమ్ము చేయించారు. ఈ ఏడాది బయటి మార్కెట్‌తో పోలిస్తే ప్రభుత్వం సరఫరా చేసిన విత్తనాలు 30 కిలోలు బస్తా సమంగా ధర ఉంది. దీంతో బయటి మార్కెట్‌లో రూ. 1100 చొప్పున వెచ్చించి విత్తనాలను సమకూర్చుకున్నారు. ప్రభుత్వం నుంచి విత్తనాల సరఫరా సకాలంలో జరగకపోవటంతో పొలాలు అదును తప్పకుండా ఉండేందుకు బయటి మార్కెట్‌ను ఆశ్రయించాల్సి వచ్చింది.

బోర్లు ఉన్న భూముల్లో..

బోర్లు సదుపాయం ఉన్న భూముల్లో రైతులు వరి నారుమడులు పోసుకున్నారు. ఎంటీయూ, బీపీటీ, ఇతర సాధారణ రకాలను రైతులు ఎంపిక చేసుకుని నారుమడులు పోశారు. ప్రస్తుతం నారుమడులు నాట్లకు సిద్ధమవుతున్నాయి. నారుమడితోపాటుగా వెదజల్లే పద్ధతిలోనూ రైతులు విత్తనాలను చల్లుకుని సాగుకు ఉపక్రమించారు. నారుమడి సిద్ధమవుతుండటంతో భూమిని దమ్ము చేయించి వరి నాట్లకు సన్నద్ధం చేసుకుంటున్నారు.

సాగునీటిపై ఆందోళన..

గత ప్రభుత్వంలో ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభం నాటికే కాలువల ద్వారా సాగునీటిని విడుదల చేసింది. చివరి భూములకు సాగునీరు సమృద్ధిగా చేరటంతో రైతులు సాగుపై ఆందోళన చెందలేదు. కానీ ఈ దఫా రైతుల్లో ఆందోళన నెలకొంది. ఈనెల 15కే ఖరీఫ్‌కు సాగునీటిని విడుదల చేసినా కాలువ చివరి భూములకు నీరు చేరుతుందన్న ఆశ లేకుండా పోయింది. ప్రధాన కాలువలు, అనుబంధ కాలువలు ఎక్కడ చూసినా వ్యర్థాలు, గుర్రపుడెక్క, తూటుకాడతో నిండిపోయి ఉన్నాయి. తూటుకాడ తొలగించి సాగునీటిని అందేలా చేస్తే సాగుకు ఆటంకం లేకుండా ఉండేది. కానీ తూడు తొలగింపు పనులు ప్రహసనంగా సాగుతున్నాయి. సాగునీటిని విడుదల చేస్తూ, మరో వైపు కాలువల్లో తూటుకాడ, గుర్రపుడెక్క నివారణకు క్రిమిసంహారక మందులు పిచికారీ చేయిస్తున్నారు. నీటి తడి వల్ల తూటుకాడ నశించే అవకాశం ఉండదని, తిరిగి జీవం పోసుకుని సమస్య యథాతథంగా ఉంటుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇబ్బందులను అధిగమిస్తూ ఆశాభావ దృక్పథంతో అన్నదాతలు సాగు పనుల్లో నిమగ్నమవుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement