
న్యాయవాదుల విధుల బహిష్కరణ
విజయవాడలీగల్: బీబీఏ న్యాయవాది జెట్టి ప్రణీత్ కుమార్పై సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ అధికారులు వ్యవహరించిన తీరు సరికాదని బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఏకే బాషా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ స్టేషన్ సీఐ, కానిస్టేబుల్ అనుచిత ప్రవర్తనకు నిరసనగా మంగళవారం బెజవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కోర్టు విధులకు హాజరు కాకుండా నిరసన తెలిపారు. బార్ అసోసియేషన్ నుంచి కలెక్టరేట్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహించి కలెక్టర్కు నివేదికను సమర్పించారు. అనంతరం ఏకే బాషా మాట్లాడుతూ ఈ నెల 8న ప్రణీత్కుమార్ సొంత విషయమై పోలీస్ స్టేషన్కి వెళ్లారని, అక్కడ పోలీసులు అతనిపట్ల అమానుషంగా ప్రవర్తించారని చెప్పారు. ఈ విషయమై పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేసినా పోలీసులపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. న్యాయవాదుల పట్ల పోలీసుల తీరు ఈ విధంగా ఉంటే సామాన్యుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు సుంకర కృష్ణమూర్తి, నరహరిశెట్టి నరసింహారావు, బీబీఏ గవర్నింగ్ బాడీ సభ్యుడు, ట్రెజరర్ ముద్దాడ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.