
దుర్గమ్మ హుండీ ఆదాయం రూ. 3.02 కోట్లు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు భక్తులు హుండీల ద్వారా రూ. 3.02 కోట్ల నగదును కానుకలు, మొక్కుబడుల రూపంలో సమర్పించారు. అమ్మవారికి భక్తులు సమర్పించిన కానుకలను సోమవారం మహామండపం ఆరో అంతస్తులో లెక్కించారు. 18 రోజులకుగాను రూ. 3,02,92,986 నగదు, 440 గ్రాముల బంగారం, 5.225 కిలోల వెండి లభ్యమైనట్లు ఆలయ ఈవో కె.రామచంద్రమోహన్ తెలిపారు. లెక్కింపును ఈవో పర్యవేక్షించారు.
దేశంలో
రాజ్యాంగానికి ముప్పు
పెనమలూరు: దేశంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రాజ్యాంగానికి ముప్పు వాటిల్లే పరిస్థితి నెలకొందని మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు అన్నారు. పోరంకి విజ్ఞాన భారత్ పాఠశాలలో సోమవారం అబ్దుల్ కలాం స్టడీ సర్కిల్ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వాహకుడు అమరయ్యశాస్త్రి అధ్యక్షతన.. ‘భారత రాజ్యాంగం నేడు ఎదుర్కొంటున్న సవాళు’్ల అనే అంశంపై జరిగిన సదస్సులో ఆయన ప్రసంగించారు. భారత రాజ్యాంగాన్ని రూపొందించిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కొలీజియం కమిటీ దాదాపు 60 దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి అనేక మతాలకు, జాతులకు, కులాలకు దేశ సమైక్యత విధానాలకు అనుగుణంగా రాజ్యాంగాన్ని రచించారన్నారు. అయితే దేశంలో నేటి రాజకీయ పరిస్థితుల కారణంగా రాజ్యాంగానికి తూట్లు పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయ వ్యవస్థ సైతం నాయకుల చేతిలో సవాళ్లను ఎదుర్కొంటోందన్నారు. విజ్ఞాన్ భారత్ పాఠశాల కరస్పాండెంట్ ప్రొఫెసర్ కొడాలి రామశేషాద్రిరావు తదితరులు పాల్గొన్నారు.
‘మా పాఠశాలను
తరలించొద్దు సారూ!’
వక్కపట్లవారిపాలెం(నాగాయలంక): మండలంలోని వక్కపట్లవారిపాలెం శివారు బ్రహ్మానందపురం పాఠశాలను గ్రామానికి దూరంగా తరలించవద్దని విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు సోమవారం జిల్లా కలెక్టర్కు వేడుకున్నారు. మండల విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు తమ ఇబ్బందులను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా పంచాయతీ పరిధిలో రెండు కిలోమీటర్ల దూరంలోని వక్కపట్లవారిపాలెం పాఠశాలలో విలీనం చేసే ప్రక్రియ చేపట్టారని, ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ సహేతుకం కాదని వాపోయారు. బ్రహ్మానందపురంలో నివసించే వారంతా షెడ్యూల్ కులానికి చెందినవారని, ఇక్కడి పాఠశాలలో 45 మంది విద్యార్థులు 1 నుంచి 5వ తరగతి వరకు చదువుకుంటున్న చిన్న పిల్లలని, వీరంతా రెండు కిలోమీటర్ల దూరం ఎలా నడిచి వెళ్తారని ప్రశ్నించారు. మార్గ మధ్యలో అవనిగడ్డ–నాగాయలంక, భావదేవరపల్లి ప్రధాన రహదారులు ఉన్నాయని ఈ రహదారులు ఎప్పుడూ వాహనాల రాకపోకలతో రద్దీతో ఉంటాయని, చిన్నపిల్లలు ఆ రోడ్ల వెంట ఎలా వెళ్లగలరని అన్నారు. పాఠశాలను తరలించే ప్రయత్నం విరమించకపోతే నిరసన కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుందని 30 మందికి పైగా గ్రామస్తులు బందరు వెళ్లి కలెక్టర్కు వినతిపత్రం ఇచ్చారు.
ప్రతి కార్డుదారుడికీ
ఈ–కేవైసీ తప్పనిసరి
చిలకలపూడి(మచిలీపట్నం): ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిని పొందేందుకు రేషన్కార్డులోని ప్రతి ఒక్క సభ్యుడు ఈ–కేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలని జాయింట్ కలెక్టర్ గీతాంజలిశర్మ తెలిపారు. సోమవారం నాటికి జిల్లాలో 71,110 మంది సభ్యులు ఇంకా ఈ–కేవైసీ చేయించుకోవాల్సి ఉందన్నారు. ఈ లబ్ధిదారుల వివరాలు రేషన్ షాపు డీలరు వద్ద, పౌరసరఫరాల డెప్యూటీ తహసీల్దార్ వద్ద, పౌరసరఫరాల అధికారి కార్యాలయంలో నమోదు చేసుకోవాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయంలో గ్రామ రెవెన్యూ అధికారి, డిజిటల్ అసిస్టెంట్ లాగిన్ ద్వారా చేసుకోవచ్చన్నారు.

దుర్గమ్మ హుండీ ఆదాయం రూ. 3.02 కోట్లు

దుర్గమ్మ హుండీ ఆదాయం రూ. 3.02 కోట్లు