‘ఇది ప్రపంచ తెలుగు వారికి గర్వకారణం’

United Global Progressive Alliance of Telugus Internet Emergence Programme - Sakshi

బహుళజాతి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఉత్తర అమెరికా యూజీపీఏటీ సంస్థ నడుం బిగించింది. ఉత్తర అమెరికాలోని “యునైటెడ్ గ్లోబల్ ప్రోగ్రెసివ్ అలయన్స్ ఆఫ్ తెలుగూస్” సంస్థ అంతర్జాల ఆవిర్భావ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి కే. నారాయణస్వామి, విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, మాజీ ఎమ్మెల్యే జూపూడి ప్రభాకర్ రావు, కోడూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కోరముట్ల శ్రీనివాసులు, తదితరులు ముఖ్య అతిధులుగా విచ్చేసి అశీర్వచనాలతో ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. బలహీన వర్గాలకు చేయూతనివ్వడానికి, తెలుగు జాతి కీర్తిని ఖండాంతరాలలో విస్తరింపజేయడానికి పూనుకున్న యూజీపీఏటీ నిర్వాహకుల ఆలోచనను సమిష్టిగా అభినందించారు. బలహీన వర్గాల కలల సహకారానికి దోహదపడే ఉద్దేశంతో ఈ సంస్థ ఆలోచనలను, ఆశయాలను రూపొందించడం గర్వకారణమని, భవిష్యత్తులో సామాజిక బలహీన వర్గానికి చెందిన ప్రతి పేదవారి ఆశను సంపూర్ణం చేయడానికి ఈ సంస్థ ముందుకు రావడం ప్రపంచ తెలుగు వారికి గర్వకారణమని అన్నారు. ప్రభుత్వాల ఆశయాలకు ఈ సంస్థ తమ తోడ్పాటును అందించి పేద బలహీన వర్గాల అభ్యున్నతి కోసం మార్గాదర్శకాలను, సూచనలను రూపొందించేందుకు తమ సహకారాన్ని అందించాలానే సంకల్పం, తెలుగు జాతి భవిష్యత్తుకు ఒక పెద్ద పీట వేయడం అన్నారు. అణగారిన జాతి అభ్యున్నతి కోసం పాటుబడిన అంబేద్కర్, పెరియార్, ఫూలే వంటి ఎందరో మహానుభావులను ఈ సందర్భంగా వక్తలు గుర్తుచేశారు. 

విద్య, ఉద్యోగం, వ్యవస్థాపక అభివృద్ధి తమ ప్రామాణికాలు, కుల మతాలకు అతీతంగా, రాబోయే తరాలకు వారధిగా, చుక్కానిగా, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా, ఖండాంతరాలు దాటి విదేశాలలో ఉన్న ప్రవాస భారతీయ తెలుగు వారు సమిష్టిగా కలసి భారదేశంలోని తమ తెలుగు జాతి అభ్యున్నతి కోసం, వారి అభివృద్ధి కోసం, తమ మేధస్సును వినియోగించ ఉద్దేశించిన కార్య-రూప ఆవిర్భావమే ఈ “యునైటెడ్ గ్లోబల్ ప్రోగ్రెసివ్ అలయన్స్ ఆఫ్ తెలుగూస్”  యూజీపీఏటీ సంస్థ అని నిర్వాహకులు కాకుమాని ప్రసన్న, శరత్ గద్దె, మెర్సీ ఏంజిలీన్ , కల్పనా దొప్పలపూడిలు అన్నారు. ప్రజా ప్రయోజన, అభివృద్ధి కార్యక్రమాలు రూపొందించి ప్రజల అభినందలను అందుకుంటున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజున ఈ సంస్థను ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు. ఈ సంస్థ అన్నివేళల బలహీన వర్గాల తెలుగు జాతి కోసం పాటుపడుతుందని సంస్థ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో ఉత్తర అమెరిక తెలుగు ప్రజల వారధి రత్నాకర్ పండుగాయల కృషి మరువలేనిదని, వారి సహాయ సహకారాలతో ప్రభుత్వ పతినిధులను ఈ సంస్థ కార్యక్రమానికి ఆహ్వానించి జయప్రదం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

తమ సంస్థ భవిష్యత్ కార్యాచరణ వివరాలను సభ్యులందరితో చర్చించి సంస్థ వెబ్ సైట్‌లో పొందుపరుస్తామని, ఈ కార్యక్రమాన్ని వీక్షించిన అందరికి సంస్థ కన్వీనర్ కాకుమాని ప్రసన్న, శరత్ గద్దె  అభినందనలు తెలియజేశారు. ప్రభుత్వాలకు, బడుగు జాతి వర్గానికి వారధిగా నిలుస్తూ, సంక్షేమ పధకాల రూపకల్పనలో జాతి అభివృద్ధికి తగు సూచనలు, సలహాలు ఇస్తూ తమవంతు సహాయసహకారాలు అందించడం మంచి పరిణామం అని కొనియాడారు. ఇందుకు మత విభేదాలకు తావు ఇవ్వకుండా బడుగు బలహీన వర్గాల ఆశలను, ఆశయాలను సంపూర్ణం చేయడానికి తమవంతు కృషిని అందిస్తామని పలువురు వక్తలు అన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు తమ సంస్థ ఆవిర్భావ కార్యక్రమాన్ని, కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారాన్ని జూమ్ వీడియో ప్రసారం ద్వారా వీక్షించడానికి ఏర్పాట్లు చేశారు. ముఖ్య అతిథులు సంస్థ వెబ్ సైట్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరూ వీక్షించి, సంస్థ అభివృద్ధికి తమ సలహాలు సూచనలు ఇచ్చి అభినందనలు తెలియజేశారు. సంస్థ గవర్నింగ్ కమిటీ సభ్యులు చార్లెస్ తోడేటి, బాబా సొంట్యాన, యువజన కన్వీనర్ తేజ యాదవ్, రీజినల్ కోఆర్డినేటర్స్ గాబ్రియేల్ కందుకూరి, ప్రవీణ్ మన్నం, సలీమ్ షేక్, కామేశ్వర రావు, వెంకట్ మట్ట, నరేంద్ర కడియం, సాంకేతిక నిపుణులు, ఇతర కార్యవర్గ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top