నిజామాబాద్అర్బన్ : ప్రజాప్రతినిధిగా ముసుగు వేసుకున్న ఓ కార్పొరేటర్ యువతను ‘బెట్టింగ్’లో ముంచుతూ వారి భవిష్యత్ను అంధకారంలోకి నెడుతున్నాడు. కార్పొరేటర్గా గెలవకముందు నుంచే ఐపీఎల్ బెట్టింగ్ నిర్వహించే సదరు వ్యక్తి ఇప్పుడు రాజకీయ పలుకుబడితో దందాను పట్టపగ్గాలు లేకుండా విస్తరించాడు. ఐపీఎల్ ప్రారంభానికి వారం రోజుల ముందే జిల్లా కేంద్రంతోపాటు మహారాష్ట్ర. ఆర్మూర్, కామారెడ్డి, బోధన్ ప్రాంతాల్లో యువకులను నియమించుకొని ఐడీలను విక్రయిస్తున్నాడు. రూ.500 నుంచి రూ.లక్షల వరకు ఐడీలను విక్రయిస్తున్న కార్పొరేటర్ వాటి ద్వారా బెట్టింగ్ సాగిస్తూ ప్రతిరోజూ రూ.లక్షలు సంపాదిస్తున్నాడనేది బహిరంగ రహస్యంగానే మారింది. ప్రతి సీజన్కు రూ.4 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకు యువత మీద సంపాదిస్తున్నాడని సదరు వ్యక్తి గురించి బాగా తెలిసిన వారు అంటున్నారు.
అద్దె ఇళ్లు.. ప్రైవేట్ సైన్యం
జిల్లా కేంద్రంలోని శాంతినగర్లోని కొత్త బ్రిడ్జి, డైరీ ఫామ్, నటరాజ్ థియేటర్ సమీపంలో, ధర్మపురి హిల్స్లో అద్దెకు తీసుకున్న ఇళ్లు, కామారెడ్డిలోని బస్టాండ్ పక్కన వాణిజ్య సముదాయం, బోధనలోని రెండు కేంద్రాలు ఐపీఎల్ బెట్టింగ్ కు ప్రధాన కేంద్రాలుగా కొనసాగుతున్నాయి. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేటర్గా గెలిచిన తరువాత సదరు వ్యక్తి ఆగడాలు మితిమీరాయి. ఇతనికి మహారాష్ట్రకు చెందిన మరో ఇద్దరు ఐపీఎల్ బెట్టింగ్ నిర్వాహకులు తోడు కావడంతో వ్యవహారం జోరుగా సాగుతోంది. పోలీసులకు చిక్కకుండా వారి కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ప్రైవేట్ సైన్యాన్ని నియమించుకోవడం గమనార్హం. వారంతా పోలీసుల చుట్టూ తిరుగుతూ, పోలీస్ స్టేషన్ల సమీపంలోనే ఉంటూ వారి సమాచారాన్ని సేకరించే పనిలో ఉంటారు. ఐపీఎల్ బెట్టింగ్ కేంద్రాలకు కొద్ది దూరంలో నలువైపులా యువకులు కాపలా కాస్తారు. పోలీసులు అటువైపు వెళ్తే పసిగట్టి ముందుగానే సమాచారాన్ని అందిస్తారు. ఇలా అద్దె ఇళ్లు.. ప్రైవేట్ సైన్యంతో కే(ఐ)డీ కార్పొరేటర్ ఈజీగా తప్పించుకుంటూ బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు.
యువతకు విచ్చలవిడిగా ఐపీఎల్ ఐడీల విక్రయం
ప్రతిరోజూ రూ.లక్షల లావాదేవీలు
పోలీస్ కదలికలపై పక్కా సమాచారం
జిల్లా కేంద్రంలోనే ప్రధాన అడ్డాలు


