ఆసిఫాబాద్: ఆదివాసీ యోధుడు కుమురం భీం జన్మించిన రౌటసంకెపల్లి కేవలం ఒక గ్రామం మాత్రమే కాదని.. వీరుడు కుమురంభీం, ఎడ్ల కొండను కన్న ఊరని, ఆదివాసీ సమాజ వీరత్వం, త్యాగం, ఆత్మగౌరవం, సంస్కృతికి ప్రతీకగా నిలిచే పవిత్ర స్థలమని రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. ఆసిఫాబాద్ మండలం రౌటసంకెపల్లి గ్రామంలో శుక్రవారం నిర్వహించిన కుమురంభీం జల్ జంగల్ జమీన్ స్ఫూర్తి గ్రామోత్సవం– 2026 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గవర్నర్ మాట్లాడుతూ కుమురంభీం ఇచ్చిన జల్ జంగల్ జమీన్ నినాదం కేవలం మూడు పదాలు కాదని, ప్రకృతి, మనిషి, సహజీవనానికి ప్రతీక అని పేర్కొన్నారు. హక్కులు, ఆత్మగౌరవం కోసం గొప్ప సైన్యం లేకపోయినా ధైర్య సాహసాలతో పోరాడారని, ఆయన త్యాగం దేశ ఆత్మగౌరవానికి చిరస్మరణీయ ఉదాహరణగా నిలిచిందన్నారు. ఆదివాసీ మహానేతల ఆలోచనలు, ఆదర్శాలను యువతకు చేరవేడం అందరి బాధ్యత అని గుర్తు చేశారు. గ్రామోత్సవం ద్వారా గ్రామీణాభివృద్ధి, సంప్రదాయ విద్య, ఆరోగ్యం, సామాజిక చైతన్యానికి ప్రాధాన్యం కల్పించడం అభినందనీయమన్నారు. గ్రామోత్సవ నిర్వాహక కమిటీ సభ్యులు, సామాజిక సేవకులను అభినందించారు. ప్రకృతిని పరిరక్షిస్తూ, సంస్కృతిని కాపాడుతూ సమానాభివృద్ధి కలిగిన సమాజ నిర్మాణానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ కుమురంభీం స్ఫూర్తితో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి గవర్నర్ శివప్రతాప్ శుక్లా రావడం సంతోషకరమన్నారు. ఆదివాసీలు హక్కుల కోసం నిజాం నిరంకుశ పాలనపై భీం పోరాడారని గుర్తు చేశారు. అంతకు ముందు గవర్నర్ కుమురంభీం, ఎడ్ల కొండు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి పూజలు చేశారు. గ్రామంలోని ప్రతీ ఇంటికి సోలార్ పలకలు, ఆరోగ్య, సంక్షేమ కార్డులు, దుస్తులు పంపిణీ చేశారు. భీం, ఎడ్ల కొండు నూతన కాంస్య విగ్రహాల ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. గ్రామస్తులు సామూహిక మద్యపాన నిషేధంపై ప్రతిజ్ఞ చేశారు. ఆదివాసీలు గుస్సాడీ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. కార్యక్రమాల్లో కలెక్టర్ కె.హరిత, ఎస్పీ నితిక పంత్, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, పాల్వాయి హరీశ్బాబు, వెడ్మ బొజ్జు, కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి, నిర్వాహకుడు రాయపూడి నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.


