రైతు గోస–బీజేపీ భరోసా యాత్రలో బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి కొనుగోలు కేంద్రాల సందర్శన సకాలంలో కొనుగోలు చేసి ఇబ్బందిలేకుండా చూడాలని డిమాండ్
లక్ష్మణచాంద/మామడ/కడెం/ఖానాపూర్/దిలావర్పూర్: కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం అమ్ముకోవడానికి రైతులు అరిగోస పడుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి ఆరోపించారు. గురువారం రైతు గోస–బీజేపీ భరోసా యాత్రలో భాగంగా మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, కామారెడ్డి, ఆర్మూర్, ముధోల్ ఎమ్మెల్యేలు కాటిపల్లి వెంకటరమణారెడ్డి, పైడి రాకేశ్రెడ్డి, రామారావుపటేల్, ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, కొమురయ్యతో కలిసి సోన్, దిలావర్పూర్ మండల కేంద్రాలు, మామడ మండలంలోని మామడ, పొన్కల్, కడెం మండలంలోని పెద్దూర్తండా గ్రామాలు, ఖానాపూర్ వ్యవసాయ మార్కెట్యార్డులోని వరి, జొన్న, మొక్కజొన్న కొ నుగోలు కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా రైతులు తమ గోడు వెల్లబోసుకున్నారు. సంచులు, దారాలు, ఇతర సామగ్రి తామే సొంత ఖర్చులతో కొనుగోలు చేసుకుంటున్నామని, ధాన్యం విక్రయించేందుకు కేంద్రాల వద్ద రోజుల తరబడి నిరీక్షించాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తంజేశారు. ఈ సందర్భంగా మహేశ్వర్రెడ్డి మాట్లాడు తూ.. ఆరుగాలం కష్టించి పంటలు పండించిన రైతులు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో తీవ్ర ఇబ్బందుల కు గురి కావాల్సి వస్తోందని మండిపడ్డారు. సకా లంలో ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో అకా ల వర్షాలకు తడిసి రైతులు అరిగోస పడుతున్నారని పేర్కొన్నారు. సీఎం రేవంత్రెడ్డి వెంటనే స్పందించి కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బందులు పడకుండా జూన్ 5వరకు ధాన్యం కొనుగోలు చేసి సకాలంలో డబ్బులు జమ చేయాలని డిమాండ్ చేశారు. రైతుల కష్టాలు తీరే దాకా తమ యాత్ర కొనసాగుతుందని స్పష్టం చేశారు. రైతులతో పెట్టుకుంటే బీఆర్ఎస్కు పట్టిన గతే కాంగ్రెస్కు పడుతుందని హెచ్చరించారు. కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సయ్య, పార్టీ జిల్లా అధ్యక్షుడు రితేశ్ రాథోడ్, నాయకులు సత్యం చంద్రకాంత్, రాంనాథ్, గంగన్న, రమేశ్, గంగారెడ్డి, నర్సయ్య, చిన్నయ్య, రవి, సాగర్, నరేశ్, విలాస్, శ్రీనివాస్యాదవ్, రవీందర్గౌడ్, రమణారెడ్డి, రవీందర్రెడ్డి, మోహన్నాయక్, సత్తెన్న, రమేశ్గౌడ్, శ్రీరాం, తిరుమల్, సాయికుమార్, రంజిత్, పుల్లారావు యాదవ్, సురేశ్, మౌనిక–మహేందర్, ఉపేందర్, ఆనంద్, వెంకటరాములు, మల్లేశ్, సత్యవతి, శ్రీనివాస్, ముత్యంరెడ్డి, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


