లోకేశ్వరం/సారంగపూర్: నేరాలను నియంత్రించడానికే కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నామని భైంసా ఏఎస్పీ సాయికిరణ్, నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. లోకేశ్వరం మండలం హథ్గాం, సారంగపూర్ మండలం చించోలి(బి)లో వేర్వేరుగా బుధవారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. తెల్లవారు జామున గ్రామానికి చేరుకున్న బలగాలు ఇంటింటా తనిఖీలు నిర్వహిచారు. హథ్గాంలో ధ్రువీకరణ పత్రాలు లేని 69 ద్విచక్రవాహనాలు, నాలుగు ఆటోలు, నాలుగు చక్రాల వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఏఎస్పీ సాయికిరణ్ మాట్లాడుతూ వాహన చోదకులు వాహనాల ధ్రువీకరణ పత్రాలు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. సారంగపూర్ మండలం చించోలి(బి)లో 75 ద్విచక్ర వాహనాలు, 5 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ మాట్లాడుతూ సమాజంలో పెరుగుతున్న నేరాలను అదుపు చేయడానికి, ప్రజలకు భధ్రత కల్పించడానికి, యువత భవిష్యత్తు కోసం తనిఖీలు చేపడుతున్నామన్నారు. 69 వాహనాల చలానాలు కట్టించామని తెలిపారు. కార్యక్రమాల్లో హథ్గాం సర్పంచ్ రమేష్, ముధోల్ సీఐ రవీందర్ నాయక్, లోకేశ్వరం ఎస్సై అశోక్, ముధోల్ ఎస్సై పెర్సీస్, నిర్మల్ రూరల్ సీఐ కృష్ణ, ఎస్సైలు శ్రీకాంత్, లింబాద్రి, గణేశ్ పోలీసులు పాల్గొన్నారు.


