నిర్మల్టౌన్:అణగారిన బీసీ, ఎస్సీ, ఎస్టీల కోసం బుధవారం ఎన్టీఆర్ మినీ స్టేడియంలో నిర్వహించే బహిరంగ విజయవంతం చేయాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి అన్నెల లక్ష్మణ్ కోరారు. జిల్లా కేంద్రంలోని జేఏసీ కార్యాలయంలో మంగళవారం మాట్లాడారు. రాష్ట్రంలో 90 శాతం మంది బీసీ, ఎస్సీ, ఎస్టీలే ఉన్నారన్నారు. పూలే అంబేడ్కర్, కాన్షీరాం మార్గంలో డాక్టర్ విశారదన్ మహరాజ్ చేస్తున్న చైతన్యంతో ఇటీవల మార్పులు వచ్చాయని పేర్కొన్నారు. అనంతరం బహిరంగ సభ కరపత్రాలను విడుదల చేశారు. ఇందులో రాష్ట్ర కమిటీ సభ్యులు రామగిరి రవీందర్, జిల్లా అధ్యక్షుడు యాటకారి సాయన్న, ముదిరాజ్, లీగల్సెల్ అడ్వైజర్ గొడుగు గంగాధర్, స్వామి పాల్గొన్నారు.
బాల్య వివాహాలతో చదువుకు ఆటంకం
మామడ: బాల్య వివాహాలతో బాలికల చదువుకు ఆటంకం ఏర్పడుతుందని, సాధికారిత ను సాధించలేరని మహిళా శిశు సంక్షేమశాఖ అఽ దికారి వినూత్న అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా పొన్కల్ గ్రామంలో మంగళవారం అవగాహన సమావే శం నిర్వహించారు. బాల్య వివాహాలు చేస్తే కలిగే నష్టాలపై కళాజాత బృందంతో అవగాహన కల్పించారు. అమ్మాయిలకు 18, అబ్బాయిలకు 21 ఏళ్లు నిండిన తర్వాతనే వివాహం చేయాలని సూచించారు. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ చిట్యాల లక్ష్మిరాజారెడ్డి, డీసీపీవో మురళి, సూపర్వైజర్ శ్యామల, రజని, సువర్ణ, మిషన్శక్తి కోఆర్డినేటర్ సవిత, జెండర్ స్పెషలిస్టు మౌనిక, ఫీల్డ్ అసిస్టెంట్ ముత్యం,అంగన్వాడీ టీచర్లు, ఉపాధి కూలీలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
ప్రజల భద్రతకే కమ్యూనిటీ కాంటాక్ట్
భైంసారూరల్: ప్రజల భద్రతకే పోలీసులు ఉన్నారని, శాంతిభద్రతల పరిరక్షణకు కమ్యూనిటీ కాంటాక్ట్ నిర్వహిస్తున్నామని భైంసా ఏఎస్పీ సాయికిరణ్ తెలిపారు. మండలంలోని చింతల్బోరి గ్రామంలో మంగళవారం కమ్యూనిటీ కాంటాక్ట్ నిర్వహించారు. 80 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో, ఒక కారును సీజ్ చేసి జరిమానా విధించారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు ప్రాముఖ్యతను వివరించారు. సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాలు, గంజాయి వినియోగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, మైనర్ డ్రైవింగ్ వంటి సామాజిక సమస్యలపై అవగాహన కల్పించారు. గ్రామాల్లో ఆస్తి సంబంధిత నేరాల నివారణకు ప్రజల భాగస్వామ్యం కీలకమని పేర్కొన్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే సమాచారం ఇవ్వాలని సూచించారు. సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్సై సుప్రియ, సర్పంచ్ పండిత్ పటేల్, పోలీసులు తదితరులు పాల్గొన్నారు.


