రైతు వేదన.. అరణ్య రోదన!
7
ఆరుగాలం శ్రమించి వరి, మక్క సాగు చేసిన రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. చేతికి వచ్చిన పంటను కొనుగోలు కేంద్రాలకు తరలించి రోజులు గడుస్తున్నా కాంటా పెట్టడం లేదు. కాంటా వేసిన ధాన్యం మిల్లులకు తరలించడం లేదు. లారీలు రావడం లేదని కొందరు, గన్నీ సంచులు లేవని కొన్ని కేంద్రాల్లో ధాన్యం తూకం నిలిచిపోయింది. దీంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. దీంతో ధాన్యం తూకం వేయాలని, తూకం వేసిన ధాన్యం మిల్లులకు తరలించాలని, కేంద్రాల్లో అదనపు వసూళ్లు ఆపాలని రైతులు రోడ్డెక్కుతున్నారు. అయినా వారి వేదన అరణ్య రోదనే అవుతోంది.
200 ఎకరాల్లో మంటలు
లక్ష్మణచాంద: సోన్ మండల కేంద్రం శివారులో వరి కొయ్యలకు సోమవారం రాత్రి నిప్పు అంటుకుంది. 9:30 గంటల ప్రాంతంలో ఈదురు గాలులు వీయడంతో సోన్–కూచన్పల్లి గ్రామాల మధ్య సుమారు 200 ఎకరాల్లోని పంటల వ్యర్థాలకు మంటలు విస్తరించాయి. మోటార్లు, విద్యుత్ తీగలు, బోరు బావులు కాలిపోయాయి. ఒకరిద్దరు రైతుల కోయని పంట కూడా ఆహుతైనట్లు తెలిసింది.


