ఖానాపూర్: మండలంలోని ఇక్బాల్పూర్ ఐకేపీ కొనుగోలు కేంద్రంలో ధాన్యం బస్తాలను తరలించడంలో జాప్యం జరుగుతోంది. అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపిస్తూ రైతులు శుక్రవారం రాత్రి ఆందోళనకు దిగారు. గ్రామంలోని జాతీయ రహదారి ఎన్హెచ్–61పై సుమారు గంటకుపైగా రాస్తారోకో నిర్వహించారు. ఈ ఆందోళనతో రహదారిపై ఇరువైపులా వాహనాలు నిలిచి పోయి ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. సంబంధిత అధికారులు లారీలను ఏర్పాటు చేసి కొనుగో లు కేంద్రంలో ఉన్న ధాన్యం బస్తాలను తరలించాల ని రైతులు డిమాండ్ చేశారు. గ్రామంలో అధిక సంఖ్యలో రైతులు ఉన్నారని, వాతావరణ మార్పుల నేపథ్యంలో రాత్రి వేళ వర్షం కురిస్తే ధాన్యం తడిసి నష్టపోతామని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి ధాన్యం తరలింపుపై చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో రైతులు లక్ష్మణ్, రమేశ్, శివలాల్, సుమన్ పాల్గొన్నారు.


