వేతన వెతలు.. | - | Sakshi
Sakshi News home page

వేతన వెతలు..

Mar 1 2026 7:25 AM | Updated on Mar 1 2026 7:25 AM

వేతన

వేతన వెతలు..

ఈ–పంచాయతీ ఆపరేటర్లకు ఐదు నెలలుగా అందని జీతాలు పదేళ్లుగా పనిచేస్తున్నా ఉద్యోగ భద్రత లేదని ఆందోళన సమస్య పరిష్కరించాలని డీపీవోకు వినతి

నిర్మల్‌చైన్‌గేట్‌: గ్రామ పంచాయతీ, మండల పరిషత్‌ కార్యాలయాల్లో విధులు నిర్వర్తిస్తున్న ఈ–పంచాయతీ ఆపరేటర్లు వేతనాలు రాక సతమతం అవుతున్నారు. అదనపు పనిభారం, చాలీచాలని వేతనం సకాలంలో అందక, ఉద్యోగ భద్రత లేక ఇబ్బంది పడుతున్నారు. దశాబ్ద కాలంగా విధులు నిర్వర్తిస్తున్నా తమను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐదు నెలలుగా వేతనాలు ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు డీపీవో శ్రీనివాస్‌ను శనివారం కలిసి తమ గోడు వెల్లబోసుకున్నారు.

37 మంది ఆపరేటర్లు..

ఈ–సేవలను గ్రామస్థాయి వరకు తీసుకెళ్లాలని గత ప్రభుత్వం గ్రామ పంచాయతీస్థాయిలో ఈ–పాలన విధానం కింద కంప్యూటీకరణను చేపట్టింది. ఇంటర్నెట్‌ వ్యవస్థను ఉపయోగించుకుని గ్రామ పంచాయతీ సేవల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించే ఉద్దేశంతో ఈ పంచాయతీ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఇందుకోసం 2014–15లో క్లస్టర్‌ వారీగా గ్రామ పంచాయతీ స్థాయిలో 37 ఆపరేటర్లను నియమించింది. కార్వీ సంస్థ ద్వారా ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిన నియమకాలు చేపట్టింది. సంస్థ కాలపరిమితి ఏడాది మాత్రమే ఉండడం, నియామకం గడువు ముగియడంతో 2016లో మళ్లీ విధుల్లోకి తీసుకుంది. వీరు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అవసరమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు నివేదికల రూపంలో ఆన్‌లైన్‌ చేస్తున్నారు. ప్రజాపాలన, ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతుభరోసా, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు, భవన నిర్మాణ అనుమతులు, ఆస్తి మార్పిడి, వ్యాపార లైసెన్స్లు, పెన్షన్లు, ప్రభుత్వ పథకాలు, ఎన్నికల పనులు, పంచాయతీల ఆదాయ, వ్యయాలతోపాటు ఇతరత్రా పనులు కంప్యూటీకరిస్తున్నారు.

ఐదు నెలలుగా వేతనాల్లేవ్‌..

ఆపరేటర్లకు ఐదు నెలలుగా వేతనాలు రావడంలేదు. గతంలో 15వ ఆర్థిక సంఘం ద్వారా పరిపాలన వ్యయం నుంచి 10 శాతం నిధులతో వేతనం చెల్లించేవారు. ఒక్కో ఆపరేటర్‌ కు రూ.22,750 వేతనం వచ్చేది. సర్పంచుల పదవీకాలం ముగియడంతో కేంద్రం గ్రాంట్లు నిలిపివేసింది. ఐదు నెలల క్రితం వరకు మల్టీపర్పస్‌ వర్కర్లకు కేటాయించిన నిధుల్లోని మిగులు బడ్జెట్‌ నుంచి చెల్లించారు. ప్రస్తుతం ఐదు నెలలుగా ఇవ్వడమే లేదు.

ఆపరేటర్ల డిమాండ్లివే..

ఉద్యోగ భద్రత కల్పించాలి. జానియర్‌ అసిస్టెంట్‌ పేస్కేలు అమలు చేయాలి. మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు కల్పించాలి. ఉద్యోగులందరికీ ఆరోగ్య బీమా కల్పించాలి. ఉద్యోగుల్లో ఎవరైనా మరణిస్తే వారి కుటుంబంలో ఒకరికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వాలి. వేతనాల కోసం ప్రత్యేక గ్రాంట్లు కేటాయించాలి.

ఆర్థికంగా ఇబ్బందులు..

ప్రతి నెలా వేతనాలు రాక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాము. గుర్తింపుతోపాటు భద్రత కరువైంది. వేతనాలు సక్రమంగా అందించాలి. పెండింగ్‌ వేతనాలు అందించకుంటే రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు ముందుకు సాగుతాం.

– సునీల్‌, ఆపరేటర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు

వేతన వెతలు..1
1/1

వేతన వెతలు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement