శెనగ కొనుగోళ్లు ఎప్పుడో?
కోతలు ప్రారంభమైనా మొదలు కాని వైనం.. ప్రైవేటు వ్యాపారులకు విక్రయిస్తున్న రైతులు
భైంసా: జిల్లాలో శెనగ పంట కోతలు ఊపందుకున్నాయి. ఈ సమయంలో అకాల వర్షాలు కురవడంతో రైతులు నష్టపోయారు. గత వర్షాకాలంలో సోయా కోతల సమయంలో భారీ వర్షాలు పంటను నాశనం చేశాయి. ఆ సమయంలో పరిహారం రాలేదు. ప్రభుత్వం రంగు మారిన సోయాను కొనుగోలు చేస్తామని ప్రకటించినా, జిల్లా వ్యాప్తంగా కొనుగోళ్లు జరగలేదు. గోదాముల నుంచి లారీలు త్వరగా తెప్పిస్తామని రైతులను మోసం చేశారు.
38 వేల ఎకరాల్లో సాగు..
సోయా నష్టాల నుంచి తేరుకుని యాసంగిలో జిల్లాలో 38 వేల ఎకరాల్లో శెనగ పంట సాగు చేశారు. కోతలు ప్రారంభమయ్యాయి. ఇటీవల కురిసన అకాల వర్షాలకు చేతికి వచ్చిన శెనగలు తడిశాయి. దీంతో నాణ్యత దెబ్బతింటుందని రైతులు పేర్కొంటున్నారు. మార్కెట్కు తరలించేందుకు సిద్ధంగా ఉన్నా.. కొనుగోళ్లు లేకపోవడం రైతులు ఆందోళన చెందుతున్నారు.
ప్రైవేటు వ్యాపారులకే..
వారం రోజులుగా భైంసా డివిజన్లో శెనగ కోతలు ఊపందుకున్నాయి. రైతులు భైంసా, ముధోల్, తా నూరు, కుభీర్ మార్కెట్లలో ప్రైవేటు వ్యాపారులకు పంట అమ్ముతున్నారు. క్వింటాలుకు రూ.4,800 నుంచి 5,300 వరకు ధర పలుకుతోంది. తేమ పేరి ట కోతలు, నగదు చెల్లింపుల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రభుత్వ కేంద్రాలు ఏర్పడితే ధరలు పెరిగే అవకాశం. కొనుగోళ్లు ప్రారంభించాలని ఎ మ్మెల్యే రామారావు పటేల్, మాజీ ఎమ్మెల్యేలు విఠల్రెడ్డి, బోస్లే నారాయణరావు పటేల్కు రైతులు వినతిపత్రాలు ఇచ్చారు. అయినా స్పష్టత లేదు.
పెరిగిన ఖర్చులు...
అకాల వర్షాలతో శెనగ రైతులకు పంట ఖర్చులు పెరిగిపోయాయి. ఎకరం పంట కోతకు రూ.4 వేలు చెల్లించాల్సి వస్తోంది. ఇక పంట నూర్పిడి చేసేందుకు 50 కేజీల బస్తాకు రూ. 140 నుంచి రూ.160 వరకు చెల్లిస్తున్నారు. ట్రాక్టర్లో పంట పొలం నుంచి ఇంటికి సంచులు తెచ్చేందుకు ట్రిప్పుకు రూ.1000 చెల్లించాల్సి వస్తోంది. పెరిగిన ఖర్చులతో చేతిలో చిల్లి గవ్వ లేని రైతులు చేసేదేమి లేక ఇంటికి చేరిన పంటను ప్రైవేటు వ్యాపారులకే విక్రయిస్తున్నారు.


