‘వీబీ–జీ రామ్ జీ’కూలీల రోజువారీ వేతనాలు ఖరారు
దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చిన కొత్త చట్టం
న్యూఢిల్లీ: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వికసిత్ భారత్–గ్యారంటీ ఫర్ రోజ్గార్, అజీవికా మిషన్(గ్రామీణ) (వీబీ–జీ రామ్ జీ) చట్టం–2025 దేశవ్యాప్తంగా బుధవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఉపాధి హామీ పథకంలో కూలీలకు ప్రతిఏటా కనీస పనిదినాలు 100 రోజులు ఉండగా, కొత్త చట్టంలో వాటిని 125 రోజులకు పెంచారు. అలాగే వేతనాలను సైతం పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
రోజువారీ వేతనం కనిష్టంగా రూ.300, గరిష్టంగా రూ.409గా ఖరారు చేశారు. ఉత్తరప్రదేశ్, బిహార్, జార్ఖండ్, అస్సాం, హిమాచల్ప్రదేశ్, అరుణాచల్ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల్లో కూలీల వేతనాలు 15 నుంచి 25 శాతం వరకు పెరిగాయి. దక్షిణాది రాష్ట్రాల్లో కేవలం 3 శాతం పెరిగాయి. తెలంగాణలో రోజువారీ కూలీ రూ.308, ఆంధ్రప్రదేశ్లో రూ.312 చొప్పున చెల్లించనున్నారు.
గ్రామాల్లో శాశ్వత ఆస్తుల సృష్టి, సహజ వనరుల పరిరక్షణ, వ్యవసాయ ఉత్పాదకతను మెరుగుపరచడం, జీవనోపాధి ప్రోత్సాహం, మహిళా నేతృత్వంలోని అభివృద్ధిపై దృష్టి సారిస్తూ, గ్రామీణ ఉపాధిని మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా మార్చడమే ఈ చట్టం లక్ష్యమని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. జాతీయ సగటు నిర్దేశిత వేతనాన్ని రోజుకు రూ.298.8 నుంచి రూ.327.4కు పెంచినట్లు తెలిపింది. సగటున 10 శాతానికి పైగా పెరిగినట్లు పేర్కొంది.


