యశవంతపుర: టమాటా ధరలు భగ్గుమంటున్నాయి. గత రెండు వారాల నుంచి బెంగళూరు, చుట్టుపక్కల జిల్లాల్లో వానలు పడుతున్నాయి. దీంతో కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో రవాణా చార్జీలు కూడా పెరిగాయి. ఈ నేపథ్యంలో బెంగళూరులో టమాటా ధర కేజీ రూ.60 పలుకుతోంది.
మునగకాయ, బీన్స్ ధరలు తగ్గితే, ఆకుకూరల ధరలకు రెక్కలొచ్చాయి. బీన్స్ గతనెలలో కేజీ రూ.150 ఉండగా ఇప్పుడు రూ.78 కి పడిపోయింది. వంకాయ ధరలు పెరిగాయి. బజ్జి మిరప, దోస, చోళేకాయ, అనప, కాకర, టమాటా, కొత్తిమీర ధరలు పైపైకి వెళ్తున్నాయి. ఇందుకు వర్షాలతో పాటు పెట్రో ధరలు పెరగడం కారణమని వ్యాపారులు చెబుతున్నారు. కూరగాయలను రవాణా చేసే వాహనాల డ్రైవర్లు బాడుగలు పెంచినట్లు చెబుతున్నారు. ఈ ధరలతో గృహిణులు ఇబ్బంది పడుతున్నారు.


