
యశవంతపుర: హెల్ప్లైన్ పేరుతో గాయకునికి మహిళ టోపీ వేసిన ఘటన మంగళూరులో వెలుగులోకి వచ్చింది. వివరాలు.. గాయకుడైన కె.రాజేశ్ సంగీత కచేరీలను నిర్వహించేవాడు. ఈయన స్వస్థలం దక్షిణ కన్నడ జిల్లా బెళ్తంగడి. ఆయనకు గతేడాది ఫేస్బుక్ ద్వారా సంధ్య పవిత్ర అనే మహిళ పరిచయమైంది, ఈమెది బెంగళూరు అని తెలిసింది.
మోసపోయిన వ్యక్తులకు సాయం చేస్తానని చెప్పుకొంది. ఓ వ్యవహారంలో హైకోర్టు ద్వారా కేసును పరిష్కారించుకోవాలని చెప్పి రాజేశ్ నుంచి రూ.3.2 లక్షలను పలు విడతలుగా వసూలు చేసింది. కానీ డబ్బులు తిరిగి ఇవ్వలేదు. రాజేశ్ నిలదీయగా, వేరేవాళ్లకు డబ్బులు ఇచ్చి మోసపోయినట్లు కట్టుకథలు చెప్పిందామె. బాధితుడు గట్టిగా అడగడంతో, నీ కాళ్లు చేతులు విరిచేయిస్తానని సంధ్య బెదిరించింది. రాజేశ్ బెళ్తంగడి పోలీసులకు ఫిర్యాదు చేశారు.