
జైపూర్: కవలలు.. ఇద్దరు పిల్లలు కలిసి పుడితే కవలలు అంటాం. కొన్ని సందర్భాల్లో కవలలు ఒకే పోలికలతో పుడితే.. మరికొన్ని సందర్భాల్లో వేరే పోలికలతో కూడా పుడతారు. కవలలు జంటగా పుట్టినంత మాత్రాన వారి వ్యవహారశైలి ఒకేలా ఉండే అవకాశాలు చాలా తక్కువ. అలాగని కొన్ని సందర్బాల్లో వారిద్దరూ చేసే పనులు చాలా దగ్గరగా ఉండే అవకాశాలను కూడా కొట్టిపారేయలేం. ప్రధానంగా చదువుకునేటప్పుడు కవల పిల్లల తరగతుల్లో మార్పులు పెద్దగా ఉండవు. ఒకే ఏజ్లో ఉంటారు కాబట్టి.. వారి క్లాస్లు ఎప్పుడూ ఒకే రకంగా సాగడానికే ఎక్కువ అవకాశం ఉంటుంది.
అలాగని వారిద్దరూ ఒకేలా చదువుతారని చెప్పలేం. కానీ అలా జరిగితే మాత్రం అది చాలా అరుదైన, ప్రత్యేకమైన సందర్బంగానే చెప్పాలి. ఇప్పుడు అదే జరిగింది. రాజస్తాన్లోని నాగ్పూర్ జిల్లాకు చెందిన కనిష్క, కార్తీకలు.. కవలలుగా పుట్టడమే కాదు.. జంటగానే విద్యలో దూసుకుపోతున్నారు. రాజస్తాన్ బోర్డు నిర్వహించిన ఎస్ఎస్సీ పరీక్షా ఫలితాల్లో వారిద్దరూ ఒకే పర్సంటేజ్ను సాధించడమే ఇప్పుడు వార్తల్లో నిలిచింది. ఎస్ఎస్సీ పరీక్షల్లో వారిద్దరూ 97. 17 శాతం మార్కులతో ఉత్తీర్ణీత సాధించారు. వీరిద్దరూ సాధించిన వ్యక్తిగత మార్కుల్లో స్వల్ప వ్యత్యాసం ఉన్నప్పటికీ పర్సంటేజ్ పరంగా ఒకేలా రావడంతో ఆ కవలలే వెంటే అరుదైన సందర్భం అనుకోవడం మనవంతైంది.
మెర్టా రోడ్డులోని కల్పనా చావ్లా ఇంటర్నేషనల్ ప్రైవేట్ స్కూల్లో చదవిన వీరిద్దరూ.. ఒకే పర్సంటేజ్ సాధించడంతో తల్లి దండ్రుల ఆనందానికి అవధుల్లేకుండా ఉంది. తమ పిల్లలు కలిసి పుట్టడమే కాదు.. కలిసి సాదించిన మార్కుల్లో కూడా తేడా లేకుండా ఉండటంతో వారు మరింత సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాజస్తాన్ రోడ్డు రవాణా సంస్థలో కండెక్టర్గా పని చేస్తున్న శివన్నారాయణ చౌదరి, సుమన్ చౌదరిల కుమార్తెలే కనిష్క, కార్తీకలు. వీరి సాధించిన మార్కులపై అటు స్కూల్ యాజమాన్యంతో పాటు ఇటు స్నేహితులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. శభాష్ కనిష్క, కార్తీక అంటూ పొగడ్తలు కురిపిస్తున్నారు.