గ్రేట్ నికోబార్ ప్రాజెక్టుపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ధ్వజం
న్యూఢిల్లీ: అండమాన్ నికోబార్ దీవుల్లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన గ్రేట్ నికోబార్ ఐలాండ్ ప్రాజెక్టుపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి కేంద్రంపై తీవ్రంగా మండిపడ్డారు. రక్షణ అవసరాలు, షిప్పింగ్ కోసమంటూ కేంద్రం చెబుతున్నదంతా వంటి అబద్ధమన్నారు. దేశంలోనే అత్యంత సున్నితమైన ఈ ప్రాంతంలో పర్యావరణానికి తీవ్రంగా హానికలిగిస్తూ హోటళ్లు, క్యాసినోలు నిర్మించుకోవడానికి.. కేవలం ఒకే ఒక్క వ్యాపారవేత్తకు ప్రయోజనం చేకూర్చడానికే ఈ ప్రాజెక్ట్ తెచ్చారని ఆయన ఆరోపించారు. ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా గళం వినిపించాలని, ‘వుయ్ చూజ్ గ్రీన్ ఓవర్ గ్రీడ్’అనే పిటిషన్పై సంతకం చేయాలని ప్రజలను రాహుల్ కోరారు.
ఏప్రిల్లో అండమాన్ నికోబార్ దీవుల సందర్శనకు వెళ్లిన సందర్భంగా చిత్రించిన 15 నిమిషాల వీడియోను ఆయన ఎక్స్లో విడుదల చేశారు. ‘మోదీ మీకు చూపించకూడదని అనుకుంటున్నది ఇదే’అనే శీర్షికతో ఉన్న వీడియోలో.. రాహుల్ గాంధీ సముద్రపు నీళ్లలోకి వెళ్లడం, అక్కడి స్థానికులతో, గిరిజన ప్రతినిధులతో మాట్లాడటంఉన్నాయి. ‘ఇక్కడున్న వేలాది చెట్లను నరికేసి, వాటిని అక్రమంగా తరలించి, కోట్ల డాలర్లు సంపాదించడమే వీరి ప్లాన్.
ఆ డబ్బుతో మీ హోటళ్లు, మీ క్యాసినోలు, మీ రియల్ ఎస్టేట్ సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడమే ఇక్కడ జరుగుతున్న అసలు తంతు. అదే వీరి ప్లాన్’అని ఆ వీడియోలో పేర్కొన్నారు. ‘ప్రపంచ పర్యావరణ దినం సందర్భంగా దేశంలోని యువతను ప్రతి ఒక్కరినీ ఓ ప్రశ్న అడుగుతున్నా.. మీకు ఎలాంటి భారత్ కావాలనుకుంటున్నారు? కేసినోల కోసం సతత హరిత అరణ్యాలను నేలమట్టం చేసిన, మ్యాపుల్లోంచి పగడపు దీవులు లేకుండా చేసిన, గిరిజన ప్రజలను వారి భూముల నుంచి తొలగించిన, మనం పీల్చే గాలిని విషతుల్యం చేసిన భారతదేశాన్నా లేక మన సహజ సంస్కృతిని కాపాడుకుని, మన గిరిజన వర్గాలను సంరక్షించుకునే, అభివృద్ధితో కలిసి ఉండే ప్రకృతినా’అని ఆయన ప్రశ్నించారు.


