
అదే మా సంకల్పం: ప్రధాని నరేంద్ర మోదీ
విద్యానంద్జీ మహారాజ్ శత జయంతి వేడుకలు ప్రారంభం
మోదీకి ‘ధర్మ చక్రవర్తి’ బిరుదు ప్రదానం చేసిన నిర్వాహకులు
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన నాగరికత, సజీవ సంస్కృతి మన సొంతమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఎందరో యోగులు, గురువులు, ఆచార్యులు, సాధువులు అందించిన మన ఆలోచనలు, ఆశయాలు, తాతి్వకత శాశ్వతమని, అందుకే భరతజాతి వేలాది సంవత్సరాలుగా సజీవంగా మనగలుగుతోందని వివరించారు.
ప్రఖ్యాత జైన ఆధ్యాత్మిక గురువు ఆచార్య శ్రీవిద్యానంద్జీ మహారాజ్ శత జయంతి వేడుకలు, ఏడాదిపాటు జరిగే శతాబ్ది ఉత్సవాలు శనివారం ఢిల్లీలో ప్రారంభమయ్యాయి. కేంద్ర సాంస్కృతిక శాఖ, భగవాన్ మహావీర్ అహింసా భారతి ట్రస్టు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పాల్గొన్నారు. ఆచార్య స్మారకార్థం తపాలా బిళ్ల ఆవిష్కరించారు.
ఆచార్యుడి జీవిత విశేషాలతో కూడిన ఎగ్జిబిషన్ తిలకించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి కార్యక్రమ నిర్వాహకులు ‘ధర్మ చక్రవర్తి’ బిరుదు ప్రదానం చేశారు. అనంతరం ప్రధానమంత్రి మాట్లాడుతూ... ఈ బిరుదుకు తాను అర్హుడినని భావించడం లేదని చెప్పారు. కానీ, గురువులు, యోగుల నుంచి ఏదీ లభించినా దాన్ని ప్రసాదంగా స్వీకరించడం మన సంప్రదాయం, సంస్కృతిలో భాగమని తెలిపారు. అందుకే ‘ధర్మ చక్రవర్తి’ ప్రసాదాన్ని స్వీకరించి, భరతమాతకు అంకితం ఇస్తున్నానని ఉద్ఘాటించారు.
మానవ జన్మకు అసలైన పరమార్థం అదే
భారతీయ తాతి్వక చింతనకు సేవ, మానవత్వం మూల స్తంభాలని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. హింసను హింసతోనే అణచివేసే ధోరణి ప్రపంచంలో కొనసాగిందని, కానీ, మన దేశం అహింస అనే ఆయుధం అందించిందని చెప్పారు. మానవ సేవే మహోన్నతం అని మన దేశం బోధించినట్లు తెలిపారు. షరతులు లేకుండా, నిస్వార్థంగా సాటి మానవులకు సేవ చేయడమే మానవ జన్మకు అసలైన పరమార్థమని వివరించారు.
తమ ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ, అభివృద్ధి పథకాలకు అచార్య శ్రీవిద్యానంద్జీ మహారాజ్ ఆశయాలు, బోధనలే స్ఫూర్తి అని తెలిపారు. పీఎం ఆవాస్ యోజన, జల్జీవన్ మిషన్, ఆయుష్మాన్ భారత్ యోజన వంటి పథకాలను సంతృప్త స్థాయిలో అందించాలని నిర్ణయించామని చెప్పారు. సమాజంలో ఆఖరి వ్యక్తికి సైతం ఈ పథకాలు అందాలన్నదే తమ లక్ష్యమని స్పష్టంచేశారు. ‘ప్రజలంతా కలిసి పని చేయాలి.. కలిసికట్టుగా ఎదగాలి’ అని ఆచార్య విద్యానంద్జీ మహారాజ్ బోధించారని, అదే తమ సంకల్పమని ప్రధానమంత్రి తేల్చిచెప్పారు.