‘చీకటి’ రోజుల్లో చెన్నై

Photographer L Ramachandran Chennai To Madras Photo Album - Sakshi

చెన్నై టూ మద్రాస్‌ ఫొటో ఆల్బమ్‌ 

ఆనాటి జ్ఞాపకాల ఆవిష్కరణ 

సాక్షి, చెన్నై: ఆ ఫోటోగ్రఫీ కళాకారుడు ఈ కరోనా కాలాన్ని బ్లాక్‌డేస్‌గా అభివర్ణించాడు. తన కంటికి కెమెరా కన్ను జోడించి రంగ రంగుల చెన్నై మహానగరాన్ని నలుపు తెలుపుల మద్రాసు పట్టణంగా మార్చివేశాడు. ‘చెన్నై టూ మద్రాస్‌’ పేరున ఆనాటి పాత మధురాలను ఆవిష్కరించాడు. ఈ సందర్భంగా బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అంతర్జాతీయ ప్రముఖ ఫొటోగ్రాఫర్‌ ఎల్‌ రామచంద్రన్‌ మాట్లాడారు. ఫొటోగ్రఫీపై ఒక వ్యక్తికి శిక్షణ ఇచ్చేందుకు లాక్‌డౌన్‌ సమయంలో చెన్నైలో పర్యటించినపుడు నిర్మానుష్యంగా మారిపోయినరోడ్లు, ప్రయాణికులు లేని కారణంగా బోసిపోయిన చెన్నై సెంట్రల్‌ రైల్వేస్టేషన్, ప్రాచీనకాలం నాటి హెరిటేజ్‌ భవనాలు ఆశ్చర్యపరిచాయని తెలిపారు. వచ్చేపోయే జనాలతో నిత్యం రద్దీగా ఉండే చెన్నై మహానగరం వెలవెలబోతూ వందేళ్ల వెనకటి మద్రాసు నగరంగా మారిపోయిందా అనిపించింది. లాక్‌డౌన్‌ వల్ల కీడేకాదు ప్రకృతి, పర్యావరణ పరంగా మేలు కూడా జరిగింది.

రిప్పన్‌ బిల్డింగ్‌ 
కాలుష్యాన్ని వెదజల్లే వాహనాలు తిరగడం లేదు, బ్రిటీష్‌ కాలంనాటి ప్రాచీన కట్టడాలు కొత్త అందాన్ని సంతరించుకున్నాయి. 1940 కాలంలో ఎవ్వరూ ఆఫీసులకు వెళ్లేవారు కాదని, ఇళ్ల నుంచే పనిచేసేవారని సమాచారం. నేడు అదే పునరావృతమైంది. భవిష్యత్తులో మరోసారికి అవకాశం లేని ఇటువంటి అరుదైన దృశ్యాలను కెమెరాలో బంధించాలనే ఆలోచన నుంచి ‘చెన్నై టూ మద్రాసు’ అల్బమ్‌ పుట్టుకొచ్చింది. నాటి రోజులకు అద్దం పట్టాలనే ఉద్దేశంతో బ్లాక్‌ అండ్‌ వైట్‌లో ఫొటోలను తీసి అప్పటి మధురస్ముృతులకు అనుగుణంగా  వాటిని తీర్చిదిద్దాను. ఫొటోగ్రఫీ అనేది అనంతరం, ఎన్నిరకాల కొత్తపుంతలు తొక్కినా ఇంకా పరిశోధనలు సాగుతూనే ఉన్నాయి. ఫొటోగ్రాఫర్‌గా తన 13 ఏళ్ల కాలంలో యూరప్, నార్త్‌ అమెరికాతోపాటూ ఆసియా దేశాలన్నీ పర్యటించాను.

ఆల్బమ్‌ ఆవిష్కరణలో ఫొటోగ్రాఫర్‌ ఎల్‌ రామచంద్రన్‌  
యూఎస్‌లో యూనివర్సిటీ తమిళ విభాగం నుంచి డాక్టరేట్‌ పొందాను. అంతర్జాతీయ ఫొటోగ్రఫీ పోటీల్లో అనేక అవార్డులు అందుకున్నాను. సాధారణ ప్రజలు సైతం నా ఫొటో గురించి మాట్లాడుకున్నపుడే నేను ఎంతో కొంత విజయాన్ని సాధించినట్లు భావిస్తాను. రూ.45 వేల విలువ జేసే 550 డీ కెనాన్‌ అనే సాధారణ కెమెరాతో నా వృత్తిజీవితాన్ని ప్రారంభించి ఈ ఆల్బమ్‌ కోసం అత్యంత ఖరీదైన అత్యాధునిక 5 డీ మార్క్‌–4 కెమెరాతో సిగ్మా 14 ఎంఎం ఆర్ట్‌ లెన్స్‌ను వినియోగించాను. ఆల్బం కోసం తీసిన 400 ఫొటోలు అన్నీ అద్భుతాలే. అభిలాష, అంకిత భావం ఉంటే ఫొటోగ్రఫీలో ఎవరైనా అద్భుతాలు సాధింవచ్చని తెలిపారు.

మెరీనాబీచ్‌ వద్ద నెప్పియార్‌ వంతెన 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top