ముంబైలో తొలి డెల్టా ప్లస్‌ మరణం

Mumbai records first death due to Delta Plus variant of Covid-19 - Sakshi

ముంబై: కరోనా డెల్టా ప్లస్‌ వేరియంట్‌ కారణంగా ముంబైలో తొలి మరణం సంభవించింది. కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ రెండు డోసులు సైతం తీసుకున్న 63 ఏళ్ల మహిళ జూలై 27న మరణించారని బృహన్ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ (బీఎంసీ) అధికారులు వెల్లడించారు. జీనోమ్‌ సీక్వెన్స్‌ రిపోర్టు ఆమె మరణించాక వచ్చిందని పేర్కొన్నారు. జూలై 21న పొడి దగ్గు, వాసనలేమి, ఒళ్లునొప్పులు, తలనొప్పితో ఆమె ఆస్పత్రిలో చేరారని పేర్కొన్నారు.

వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తుండగా మరణించినట్లు తెలిపారు. ఆమెకు ఎలాంటి ట్రావెల్‌ హిస్టరీ లేదని, ఆమెతో స్ననిహితంగా మెలిగిన ఆరుగురికి కరోనా నిర్ధారణ పరీక్ష చేసినట్లు వెల్లడించారు. అందులో ఇద్దరికి  పాజిటివ్‌ వచ్చిందని, ఇద్దరిలోనూ డెల్టా ప్లస్‌ వేరియంట్‌ ఉందన్నారు.  జూన్‌ 13న కూడా 80 ఏళ్ల మహిళ రత్నగిరి జిల్లాలో డెల్టా ప్లస్‌ వేరియంట్‌ కారణంగా మరణించారు. బుధవారం నాటికి మహారాష్ట్రలో 20 డెల్టా ప్లస్‌ కేసులు ఉండగా, అందులో ముంబైలోనే 7 కేసులు నమోదయ్యాయి. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top