ఆ పదవికి రాహులైతేనే బెస్ట్‌ | Mood of the Nation Rahul Gandhi Best Person to Revive Congress | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి రాహులే కరెక్ట్‌

Aug 8 2020 2:18 PM | Updated on Aug 8 2020 5:27 PM

Mood of the Nation Rahul Gandhi Best Person to Revive Congress - Sakshi

న్యూఢిల్లీ: దాదాపు 135 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ పార్టీ ప్రస్తుతం తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఏళ్ల తరబడి దేశం అంతటిని పాలించిన పార్టీ నేడు కేవలం కొన్ని రాష్ట్రాలకే పరిమితమయ్యింది. కొన్ని చోట్ల అసలుకే గల్లంతయ్యింది. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో పార్టీ పగ్గాలను వదిలేసారు రాహుల్‌ గాంధీ. కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఎందరు ఎన్ని రకాలుగా నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఆయన మాత్రం తన నిర్ణయం మార్చుకోలేదు. ప్రస్తుతం సోనియా గాంధీ కాంగ్రెస్‌ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇండియాటుడే నిర్వహించిన మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌ సర్వే ఆసక్తికర విషయాలను వెల్లడించింది. కాంగ్రెస్‌ పార్టీ బాధ్యతలు చేపట్టడానికి రాహుల్‌ గాంధీనే సరైన వ్యక్తిగా ప్రజలు విశ్వసిస్తున్నారని ఈ నివేదిక తెలిపింది. సర్వేలో పాల్గొన్న వారిలో 23 శాతం మంది కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్‌ గాంధీ అయితేనే బెస్ట్‌ అని అభిప్రాయపడ్డారని వెల్లడించింది. (అత్యుత్తమ సీఎంలలో వైఎస్‌ జగన్‌కు మూడో స్థానం)

పార్టీని పునరుద్ధరించడానికి ఏ నాయకుడు బాగా సరిపోతారని మీరు అనుకుంటున్నారని ప్రశ్నించగా.. 23 శాతం మంది రాహుల్‌ గాంధీకి ఓటు వేశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ 18 శాతం ఓట్లతో రెండో స్థానంలో ఉన్నారు. ఇక ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ 14 శాతం ఓట్లతో నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు. ఇక రాజస్తాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ 2 శాతం ఓట్లతో ఆఖరి స్థానంలో ఉండగా.. తిరుగుబాటు నేత సచిన్‌ పైలట్‌ 3 శాతం ఓట్లతో చివరి నుంచి రెండో స్థానంలో ఉన్నారు. పార్టీని నూతన పునరుజ్జీవనం వైపు నడిపించడానికి రాహుల్‌ అయితేనే బెస్ట్‌ అని ఎక్కువ మంది ప్రజలు ఓటు వేశారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘోర పరాజయాన్ని చవి చూడటంతో 2019 ఆగస్టులో రాహుల్‌ గాంధీ కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ అధ్యక్ష పదవి నుంచి వైదొలగిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement