భోపాల్: మధ్యప్రదేశ్లోని రత్లాం జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున తిరువనంతపురం-హజ్రత్ నిజాముద్దీన్ రాజధాని ఎక్స్ప్రెస్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదంతో అప్రమత్తమైన సిబ్బంది 68 మంది ప్రయాణికులతో ఉన్న కోచ్ను 15 నిమిషాల్లోనే సురక్షితంగా ఖాళీ చేయించారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
రైల్వే అధికారుల ప్రకారం, తిరువనంతపురం నుంచి ఢిల్లీకి ప్రయాణిస్తున్న 12431 నంబరు గల రైలులోని బి-1 కోచ్లో ఉదయం 5.15 గంటల ప్రాంతంలో ఈ మంటలు చెలరేగాయి. కోటా రైల్వే డివిజన్ పరిధిలోని విక్రమ్గఢ్ ఆలోట్,లునిరిచా స్టేషన్ల మధ్య ఈ సంఘటన జరిగిందని రత్లాం డివిజన్ పీఆర్ఓ ముఖేష్ కుమార్ తెలిపారు. ఈ రైలు ఉదయం 3.45 గంటల ప్రాంతంలో రత్లాం జంక్షన్ నుంచి బయలుదేరింది.
ఈ ఘటన ఢిల్లీ-ముంబై రైలు మార్గంలో రైళ్ల రాకపోకలపై ప్రభావం చూపింది, కనీసం ఐదు నుంచి ఆరు రైళ్ల షెడ్యూళ్లకు అంతరాయం కలిగింది. ఈ ఘటన తర్వాత పలు రైళ్లను వివిధ స్టేషన్లలో నిలిపివేశారని అధికారులు తెలిపారు. ప్రమాదం, రైళ్ల రాకపోకల అంతరాయంపై ప్రయాణికుల సౌకర్యార్థం కోసం రైల్వే అధికారులు హెల్ప్లైన్లను అందుబాటులోకి తెచ్చారు.


