ముంబై: మహారాష్ట్రలో దారుణం జరిగింది. భార్య ముందు తనను అవమానించారనే కోపంతో ఓ వ్యక్తి కన్న తల్లిదండ్రులనే రోకలితో కొట్టి దారుణంగా హత్య చేసిన ఘటన.. శుక్రవారం మధ్యాహ్నం ధూలే జిల్లాలోని శిర్పూర్లోని మహావీర్ సొసైటీలో జరిగింది. తమ కుమార్తె పెళ్లి ముగించుకుని తల్లిదండ్రులు అదే రోజు ఇంటికి తిరిగి రాగా.. ఇంటికి వచ్చిన తర్వాత వారు ఏదో కారణంతో తన కుమారుడిని మందలించడమే కాకుండా.. కోడలి ముందే అతడిని తక్కువ చేసి మాట్లాడారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన కుమారుడు.. ఇంట్లో ఉన్న రోకలిని తీసుకుని తన తల్లిదండ్రుల తలపై బలంగా బాదాడు.
ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన తల్లి రంజుదేవి మహతో, తండ్రి ఇందారామ్ మహతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఘటన అనంతరం నిందితుడు చందన్ ఇందారామ్ మహతో అక్కడి నుండి పారిపోవడానికి ప్రయత్నించగా.. గమనించిన స్థానికులు అతడిని పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


