మహిళలకు 'మహా' మినహాయింపు.. ఎందులో తెలుసా..?
ముంబై: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు మహారాష్ట్ర సర్కార్ తీపి కబురు చెప్పింది. మహిళల పేరిట జరిగే ఆస్తుల రిజిస్ట్రేషన్లకు సంబంధించి స్టాంప్ డ్యూటీని ఒక శాతం తగ్గిస్తున్నట్లు ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రకటించారు. సోమవారం జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2021-22 ఆర్ధిక సంవత్సరానికి గానూ మహిళలకు భారీ కేటాయింపులు చేయన్నుట్లు ప్రకటించారు. మహిళలకు ఆస్తుల రిజిస్ట్రేషన్లో మినహాయింపు ఇవ్వడం వల్ల ప్రభుత్వ ఖజానాపై రూ.1000 కోట్ల అదనపు భారం పడనుందని వివరించారు. మహిళలకు మహారాష్ట్ర సర్కార్ పెద్దపీట వేస్తుందని, రాష్ట్రంలో అమలవుతున్న మహిళా సంక్షేమ పథకాలే ఇందుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.