మళ్లీ సీఎం స్టాలిన్‌ | Loyola College Alumni Survey MK Stalin Win In 2026 elections | Sakshi
Sakshi News home page

మళ్లీ సీఎం స్టాలిన్‌

Jun 23 2025 10:56 AM | Updated on Jun 23 2025 12:26 PM

Loyola College Alumni Survey MK Stalin Win In 2026 elections

 77 శాతం మద్దతు 

 పళనికి 67 శాతం 

 విజయ్‌కు 60 శాతం 

సాక్షి, చెన్నై: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాట సీఎం అయ్యే అర్హత మళ్లీ ఎంకే స్టాలిన్‌కే ఉందని లయోలా కళాశాల పూర్వవిద్యార్థుల సర్వేలో తేలింది. 77 శాతం మంది స్టాలిన్‌కే మద్దతు పలికారు. 67 శాతం మంది అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి/స్వామికి , 60 శాతం మంది తమిళగ వెట్రి కళగం నేత విజయ్‌కు ఓటు వేశారు.అయితే, విజయ్‌ కంటే ఒక అడుగు ముందు వరుసలో బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలైకు 64 శాతం మంది మద్దతు ఇవ్వడం విశేషం.
 
2026 అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ అధికారం దిశగా డీఎంకే కసరత్తుల వేగాన్ని పెంచింది. ఈసారి అధికార పగ్గాలు చేజిక్కించుకునే విధంగా అన్నాడీఎంకే వ్యూహాలకు పదును పెట్టింది. మార్పు అంటూ తొలిసారిగా ఎన్నికల కదన రంగంలోకి సినీ నటుడు, తమిళగ వెట్రి కళగం నేత విజయ్‌ సన్నద్ధమయ్యారు. ఈ పరిస్థితుల్లో 2026 ఎన్నికల్లో  సీఎం అయ్యే అర్హత ఎవరికి ఉందో, ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఎవరికి ఓటు వేస్తారో ప్రస్తుత ప్రభుత్వ పథకాల తీరు తెన్నుల గురించి చెన్నైలోని లయోలా కళాశాల పూర్వవిద్యార్థుల సంఘం సర్వే చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన సర్వే వివరాలను ఆదివారం ప్రెస్‌ క్లబ్‌ వేదికగా ప్రకటించారు. 

స్టాలిన్‌కే మద్దతు 
ఈ సర్వే మేరకు 2026 ఎన్నికల్లో సీఎం అయ్యే అర్హత స్టాలిన్‌కే ఉందని 77.83 శాతం మంది మద్దతు పలికారు. అలాగే 67.99 శాతం మంది అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణిస్వామి సీఎం కావాలని మద్దతు ఇచ్చారు. డీఎంకే వారసుడు ఉదయనిధి స్టాలిన్‌ సీఎం కావాలని 67.99 శాతంమంది మద్దతు ఇవ్వడం గమనార్హం. ఇక, బీజేపీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్‌ అధికారి అన్నామలై సీఎం కావాలని 64.58 శాతం మంది మద్దతు ఇవ్వడం గమనార్హం. ఇక, గత ఏడాది రాజకీయ పార్టీని ప్రకటించి ప్రస్తుతం దూకుడుగా వ్యూహాలకు పదును పెట్టిన విజయ్‌ సీఎం కావాలని 60.58 శాతం మంది మద్దతుగా ఓటు వేసినట్టు సర్వే వివరాలలో పేర్కొన్నారు. ఇక, ఎన్నికలు వస్తే ఎవరికి ఓటు వేస్తారో అన్న ప్రశ్నకు డీఎంకేకు 17.70 శాతం, అన్నాడీఎంకేకు 17.30 శాతం, 12.20 శాతం మంది తమిళగవెట్రి కళగంకు మద్దతుగా తమ అభిప్రాయాలను తెలియజేశారు.

 ఇక, ప్రస్తుత డీఎంకే ప్రభుత్వ పథకాల తీరు తెన్నులకు ఓట్లు అధికంగానే పడ్డాయి. ఇందులో అల్పాహార పథకానికి 72 శాతం మంది, మహిళా హక్కు పథకానికి 62 శాతం మంది, మహిళలకు ఉచిత బస్సు సేవలకు 56 శాతం మంది మద్దతు ఇచ్చారు. తమిళనాడు ప్రజల సమస్యలను తక్షణం పరిష్కరించే పార్టీ డీఎంకే అని 25.30 శాతం మంది, అన్నాడీఎంకే అంటూ 22.80 శాతం మంది, 15.70 శాతం బీజేపీ, 11.72 శాతం తమిళగ వెట్రి కళగం అంటూ  తమ మద్దతును తెలియజేసి ఉండడం గమనార్హం. ఈ శాతాన్ని బట్టి చూస్తే రానున్న అసెంబ్లీ ఎన్నికల సమరం హోరాహోరీ అన్నట్టుగా సాగడం స్పష్టమవుతోంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement