తండ్రికి కిడ్నీదానం.. రాజకీయాల్లోకి మాజీ సీఎం కూతురు? | Lalu Yadav Daughter Rohini May Make Poll Debut | Sakshi
Sakshi News home page

తండ్రికి కిడ్నీదానం.. రాజకీయాల్లోకి మాజీ సీఎం కూతురు?

Mar 18 2024 5:05 PM | Updated on Mar 18 2024 7:51 PM

Lalu Yadav Daughter Rohini May Make Poll Debut - Sakshi

పాట్నా: బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ (RJD) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె 'రోహిణి ఆచార్య' రాజకీయ అరంగేట్రం చేయనున్నట్లు తెలుస్తోంది. బీహార్‌లోని సరన్ స్థానం నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నట్లు సమాచారం.

యాదవ్ కుటుంబానికి సన్నిహితుడుగా పేరుగాంచిన బీహార్ శాసన మండలి సభ్యుడు సునీల్ కుమార్ సింగ్ సోషల్ మీడియా పోస్ట్ తర్వాత శ్రీమతి ఆచార్య రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. 2009లో లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ పోటీ చేసిన స‌ర‌న్ ఎంపీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి రోహిణి పోటీ చేయ‌బోతున్నారని చెబుతున్నారు.

డాక్టర్ రోహిణి ఆచార్య తన తండ్రి పట్ల చూపించే ప్రేమ, భక్తి, అంకితభావానికి దాదాపు అందరికి తెలుసు. సరన్ ప్రాంతంలోని పార్టీ కార్యకర్తలు అందరూ ఆమెను సరన్‌కు పార్టీ లోక్‌సభ అభ్యర్థిగా ప్రకటించాలని కోరుకుంటున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు.

ఈ నెల ప్రారంభంలో పాట్నాలోని గాంధీ మైదాన్‌లో జరిగిన ఆర్జేడీ ర్యాలీలో ఆచార్య కూడా పాల్గొన్నారు. సరన్ లోక్‌సభ స్థానం ప్రస్తుతం బీజేపీకి చెందిన రాజీవ్ ప్రతాప్ రూడీ చేతిలో ఉంది. దీనికి గతంలో లాలూ ప్రసాద్ యాదవ్ ప్రాతినిధ్యం వహించారు. 

రోహిణి ఆచార్య ఎవరు?
రోహిణి ఆచార్య వృత్తి రీత్యా ఎంబీబీఎస్ డాక్ట‌ర్. ఈమె 2002లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, రిటైర్డ్ ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీసర్ సమేష్ సింగ్‌ను వివాహం చేసుకుంది. ఇతడు లాలూ యాదవ్ స్నేహితుడైన.. రాయ్ రణవిజయ్ సింగ్ కుమారుడు. గత రెండు దశాబ్దాలుగా, శ్రీమతి ఆచార్య, ఆమె భర్త విదేశాల్లో నివసిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులున్నారు.

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే శ్రీమతి ఆచార్య.. 2022లో అనారోగ్యంతో ఉన్న తన తండ్రికి  కిడ్నీ దానం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది. ఆచార్య చేసిన పనికి ప్రతిపక్ష పార్టీలు కూడా ప్రశంసించాయి. అంతకుముందు 2017లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉందని ఊహించారు. కానీ అది జరగలేదు.

Advertisement
 
Advertisement
Advertisement