
గదగ్ కోర్టు తీర్పు
హుబ్లీ/ యశవంతపుర: ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి యువజంట దారుణ హత్యకు గురైంది. ఈ మర్యాద హత్య కేసులో గదగ్ జిల్లా కోర్టు నలుగురు దోషులకు మరణశిక్షను విధిస్తూ తీర్పు చెప్పింది.
వివరాలు.. గదగ్ జిల్లాలోని గజేంద్రగడ తాలూకా లక్కలకట్టి గ్రామానికి చెందిన రమేష్ మాదర (29), గంగమ్మ (23) అనే దంపతులను 2019లో కత్తులతో పొడిచి హత్య చేశారు. గంగమ్మ బంధువులే ఈ రక్తపాతానికి పాల్పడ్డారు. కులాంతర పెళ్లి చేసుకోవడం వారికి ఎంతమాత్రం ఇష్టం లేదు.
గజేంద్రగడ పోలీసులు గంగమ్మ బంధువులైన శివప్ప రాథోడ్, రవికుమార్ రాథోడ్, రమేష్ రాథోడ్, పరశురామ రాథోడ్తో పాటు మరికొందరిని అరెస్టు చేసి, జిల్లా కోర్టులో చార్జిషీట్ ను సమర్పించారు. విచారణలో ఈ నలుగురి నేరం రుజువు కావడంతో వారికి మరణశిక్ష విధిస్తున్నట్లు జడ్జి తీర్పు వెలువరించారు. అనంతరం దోషులను జైలుకు తరలించారు. మరికొందరిపై ఆరోపణలు రుజువు కాకపోవడంతో విముక్తుల్ని చేశారు.