కరోనా: ఐవర్మెక్టిన్తో తగ్గుతున్న మరణాల ముప్పు!
న్యూఢిల్లీ: నోటి ద్వారా తీసుకొనే యాంటీ పారాసైటిక్ (పరాన్నజీవుల ద్వారా కలిగే ఇన్ఫెక్షన్ను నయం చేయడానికి వాడే మెడిసిన్) ఔషధం ఐవర్మెక్టిన్ తరచూ తీసుకోవడం ద్వారా కరోనా సోకే ముప్పు బాగా తగ్గుతోందని, కరోనా రోగుల్లో మరణ ముప్పు కూడా తగ్గుతున్నట్లు తాజా పరిశోధనలో తేలింది. దీనికి సంబంధించిన వివరాలను అమెరికా జర్నల్ ఆఫ్ థెరప్యూటిక్స్ వెల్లడించింది. ఈ మందు కరోనాను అంతం చేసేందుకు ఉపయోగపడుతుందని పరిశోధనలో పాల్గొన్న చీఫ్ మెడికల్ ఆఫీసర్ పియరీ కోరీ తెలిపారు. ఐవర్మెక్టిన్పై ఉన్న సమాచారాన్నంతా క్రోడీకరించి ఈ వివరాలను వెల్లడిస్తున్నట్లు తెలిపారు.
ఈ ఏడాది జనవరిలో మొత్తం 27 కంట్రోల్డ్ ట్రయల్స్ జరిపామని, అందులో 15 రాండమైజ్డ్ కంట్రోల్ ట్రయల్స్ అని తెలిపారు. మొత్తం 2,500 మంది రోగుల మీద దీన్ని పరీక్షించి... ఫలితాలను విశ్లేషించినట్లు వెల్లడించారు. ఇది తీసుకున్న వారిలో మరణాల రేటు తగ్గగా, రికవరీ సమయం కూడా ఇతరులతో పోలిస్తే తగ్గిందని పేర్కొన్నారు. ఐవర్మెక్టిన్ వాడితే కరోనా సోకే అవకాశాలు కూడా తగ్గిపోతున్నాయని తెలిపారు. ఈ మందును ఇప్పటికే పలు చోట్ల వినియోగిస్తున్నారని, అన్ని చోట్ల ఆశాజనకమైన ఫలితాలు వస్తున్నట్లు వెల్లడించారు.
(చదవండి: కరోనా: అంతా ఓకే ఆనుకోవద్దు)