
వాషింగ్టన్: ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధంలో ఇజ్రాయెల్కు మద్దతు పలుకుతూ, అమెరికా వారాంతంలో ఇరాన్లోని కీలక సైనిక స్థావరాలపై దాడులు చేసింది. ఈ దాడుల దరిమిలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్లో పాలనా మార్పు జరిగే అవకాశంపై సూటిగా ప్రశ్నించారు.
‘పాలనా మార్పు అనే పదాన్ని ఉపయోగించడం రాజకీయంగా సరైనది కాదు. కానీ ప్రస్తుతమున్న ఇరానియన్ పాలన.. ఇరాన్ దేశాన్ని గొప్పగా మార్చలేని పక్షంలో పాలనలో మార్పు ఎందుకు జరగకూడదు?’ అని ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ప్రశ్నించారు. ఇరాన్లోని ఫోర్డో అణు కేంద్రంపై అమెరికా 30 వేల పౌండ్ల బంకర్-బస్టర్ బాంబులను ప్రయోగించిన అనంతరం టెహ్రాన్(ఇరాన్) తమను తాము రక్షించుకోగలమని స్పష్టం చేసింది.
ఇదిలావుండగా ఇరాన్- ఇజ్రాయెల్ పరస్పరం క్షిపణి దాడులను కొనసాగించాయి. పశ్చిమ ఇరాన్లో జరిగిన పేలుళ్లలో 12 మంది సైనిక సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్లు ఇరాన్ మీడియా సంస్థ తెలిపింది. అంతకుముందు ఇరాన్ క్షిపణుల ప్రయోగంతో పలువురు గాయపడ్డారు. టెల్ అవీవ్లోని పలు భవనాలు నేలమట్టమయ్యాయి. యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ స్థానికులను లెబనాన్ విడిచి వెళ్లాలని ఆదేశించింది.ఈ ప్రాంతంలోని ఇతర ప్రాంతాల పౌరులు ప్రయాణాలను పరిమిత చేసుకోవాలని సూచించింది. యునైటెడ్ స్టేట్స్ తమ దేశానికి పొంచివున్న ముప్పు కారణంగా ప్రధాన నగరాల్లో చట్ట అమలు గస్తీని ముమ్మరం చేసింది. మత, సాంస్కృతిక, దౌత్య ప్రదేశాల్లో అదనపు బలగాలను మోహరించింది.