కోవిడ్‌పై మోదీ సమీక్ష.. టెస్ట్‌, ట్రేసింగ్‌పై కీలక వ్యాఖ్యలు

India Recorded 1134 New Corona Cases And Active Cases Increased - Sakshi

ఢిల్లీ: దేశంలో మళ్లీ కోవిడ్‌ కేసుల సంఖ్య పెరుగుతోంది. యాక్టివ్‌ కేసులు, పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అలర్ట్‌ అయ్యింది. ఈ నేపథ్యంలో కోవిడ్‌పై ప్రధాని నరేంద్ర మోదీ.. బుధవారం సాయంత్రం అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి వివిధ శాఖల అధికారలు, పీఎంఓ ఉన్నతాధికారులు హాజరయ్యారు. 

ఈ సందర్భంగా కరోనా కేసులు, ఇన్‌ఫ్లూ పరిస్ధితిని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి ప్రధాని మోదీకి వివరించారు. మార్చి 22తో ముగిసిన వారంలో దేశంలో సగటున 888 రోజువారీ కేసులు నమోదు కాగా, పాజిటివ్ రేటు 0.98 శాతంగా పెరిగిందని ఆయన ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. అలాగే ప్రధానమైన 20 కోవిడ్ డ్రగ్స్, ఇతర డ్రగ్స్ 12, బఫర్ డ్రగ్స్ 8, ఇన్‌ఫ్లూయెంజా డ్రగ్ లభ్యత , ధరలను పర్యవేక్షిస్తున్నట్లు ప్రధానికి ఆరోగ్య శాఖ అధికారులు సమాచారం అందించారు. దేశంలోని ఇన్‌ఫ్లూయెంజా పరిస్ధితిపై ప్రత్యేకించి గత కొన్ని నెలల్లో అత్యధిక సంఖ్యలో హెచ్1ఎన్1, హెచ్3ఎన్2 కేసులు నమోదవుతున్నాయని ప్రధానికి ఆరోగ్య శాఖ కార్యదర్శి వివరించారు. 

ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ల్యాబ్స్‌లో జీనోమ్ సీక్వెన్సింగ్‌ను మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు. దీని వల్ల కొత్త వేరియంట్‌లు ఏమైనా ఉంటే వాటి ట్రాకింగ్‌‌కు, సకాలంలో ప్రతిస్పందనకు మద్ధతుగా ఉంటుందని తెలిపారు. టెస్ట్ , ట్రాక్, ట్రీట్, వ్యాక్సినేషన్‌పై దృష్టి సారించాలని పేర్కొన్నారు. రోగులు, డాక్టర్లు, ఆరోగ్య కార్యకర్తలు ఆసుపత్రి ప్రాంగణంలో మాస్క్‌లు ధరించడంతో పాటు కోవిడ్ ప్రోటోకాల్‌ను పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సీనియర్ సిటిజన్లు, అనారోగ్యాలతో బాధపడుతున్న వారు రద్దీగా వుండే ప్రాంతాల్లో మాస్క్‌లు ధరించాలని ప్రధాని కోరారు. అలాగే, ఐఆర్‌ఐ/ ఎస్‌ఏఆర్‌ఐ కేసులపై పర్యవేక్షణ ఇన్‌ఫ్లూయెంజా, కోవిడ్ 19, అడెనోవైరస్‌లకు సంబంధించిన పరీక్షలకు సంబంధించి రాష్ట్రాలతో సమన్వయం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు.

ఇన్‌ఫ్లూయెంజా, కోవిడ్ 19 కోసం అవసరమైన డ్రగ్స్, లాజిస్టిక్స్, ఆసుపత్రుల్లో బెడ్స్‌, ఆరోగ్య సిబ్బందిని అందుబాటులో ఉండాలన్నారు. కోవిడ్ 19 మహమ్మారి ఇంకా ముగిసిందన్నారు. దేశవ్యాప్తంగా ప్రస్తుత స్థితిని క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని కోరారు.  అక్యూట్ రెస్పిరేటరీ ఇల్‌నెస్ (SARI) కేసుల ల్యాబ్ నిఘా , పరీక్షలను మెరుగుపరచాలని ఆదేశించారు. దేశంలోని ఆసుపత్రులు అత్యవసర పరిస్ధితులకు సిద్ధంగా వున్నాయని నిర్ధారించుకోవడానికి క్రమం తప్పకుండా మాక్ డ్రిల్స్‌ను నిర్వహించాలన్నారు. 

కాగా.. గత నాలుగు రోజులుగా మాత్రం యాక్టివ్‌ కేసులు, పాజిటివ్‌ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఇదే సమయంలో మరణాలు కూడా పెరుగుతున్నాయి. ఇక, దేశంలో గత నాలుగు రోజులుగా వెయ్యికి చేరువలో కేసులు నమోదవుతున్నాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో 1,03,831 మందికి కరోనా టెస్టులు నిర్వహంచగా.. 1,134 మందికి పాజిటివ్‌గా తేలింది. ఇదే సమయంలో ఐదుగురు మృతిచెందారు. తాజా కేసులతో దేశంలో ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 4,46,98,118 కి చేరినట్టు స్పష్టం చేసింది.

ఇక, దేశంలో ప్రస్తుతం.. 7,026 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని తెలిపింది. గత 24 గంటల్లో ఢిల్లీ, ఛత్తీస్‌గఢ్‌, గుజరాత్‌, మహారాష్ట్ర, కేరళలో ఒక్కొక్కరు చొప్పున మొత్తం కరోనాతో మృతి చెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,30,813కి చేరింది. ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్‌ కేసుల్లో 0.02 శాతం మాత్రమే యాక్టివ్‌గా ఉన్నాయని ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.

ఇది కూడా చదవండి: ఉత్తరాదిన పెను భూకంపం 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top